జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సోమవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున ‘వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్’ ఉండాలని కోరుకుంటున్నామని, ఆ దిశగానే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ వ్యూహాలు ఉంటాయని పేర్కొన్నారు. అందుకోసం ఎవరితో కలవాలి, ఏం చేయాలి, అప్పటి పరిస్థితులను బట్టి ఆలోచిస్తాం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఇప్పటి వరకూ అధికారం చూడని అన్ని వర్గాలను కలుపుకొని అడుగులు వేస్తామని అన్నారు.
జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీచేస్తామని కానీ, చేయమని కానీ చెప్పలేం, సందర్భాన్ని బట్టి వ్యూహం:
వ్యూహాన్ని సందర్భాన్ని బట్టి చెబుతామని, సందర్భాన్ని బట్టి వ్యూహం మారుతూ ఉంటుందని, ఏ వ్యూహం వేసినా అంతిమ లక్ష్యం మాత్రం మాత్రం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్. మా ముఖ్య ఉద్దేశం, లక్ష్యం అదేనని పవన్ కళ్యాణ్ అన్నారు. “వ్యూహం అనేది చెప్పేది కాదు. కాలాన్ని, పరిస్థితిని బట్టి పరిణామక్రమం చెందేది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ప్రకటిస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సోనియా గాంధీ ఇంటికి కుటుంబంతో వెళ్లి మరి మనస్ఫూర్తిగా కలిపేస్తానని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక వచ్చిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. చివరి వరకు వ్యూహం పరిమాణ క్రమంలో ఉంటుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తామని కానీ, చేయమని కానీ ఇప్పుడు చెప్పలేము. మునుముందు ఎలాంటి పరిస్థితులు వస్తాయో వాటిని బేరీజు వేసుకొని ముందుకు వెళ్తాం. ప్రధాని మోదీ టీడీపీని రానివ్వరు, చంద్రబాబును కలవరు అన్నారు. మొన్న ఇద్దరు కలిశారు కదా” అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
“ఢిల్లీలో బయటపడిన మద్యం మాఫియాలో చాలా మంది వైసీపీ నాయకులు ఉన్నారని కేంద్ర మంత్రి అనురాగ్ రాకూర్ చెప్పారు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది? ఎవరెవరూ లోపలకు వెళ్తారో ఇప్పుడే చెప్పలేం. జరుగుతున్న పరిణామాల బట్టి వ్యూహం ఉంటుంది. వ్యూహం అనేది ప్రజలు గెలవడానికి వేస్తాను. రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేలా, యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా, రాయలసీమ, ప్రకాశం జిల్లాల నుంచి వలసలు ఆగేలా జనసేన పార్టీ వ్యూహం ఉంటుంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం అనే మాటకు కొనసాగింపే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY