దేశ చరిత్రలోనే మొదటిసారి ఏ పార్టీ చేయని సాహసం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. పెద్ద సంఖ్యలో సిట్టింగ్లను మార్చేస్తున్నారు. ఇప్పటికే 35 అసెంబ్లీ స్థానాలు.. 3 పార్లమెంట్ స్థానాల సిట్టింగ్లకు జగన్ షాక్ ఇచ్చారు. మరో 29 మందిని కూడా మార్చనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో సిట్టింగ్లను ఛేంజ్ చేస్తుండడంతో.. అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. పెద్ద ఎత్తున నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. టికెట్ దక్కలేదని పెద్ద ఎత్తున నేతలు కండువా మార్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు తెలుగు దేశం పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ సీనియర్ నేత, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి త్వరలో టీడీపీ కండువా కప్పుకోబుతున్నారట. ఈసారి పార్థసారధిని పక్కకు పెట్టి పెనమలూరు టికెట్ మరొకరికి ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ఈక్రమంలో టికెట్ నిరాఖరించడంతో పార్థసారథి అసంతృప్తితో రిగిలిపోతున్నారట. పార్థసారధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన పార్థసారథి.. మచిలీపట్నం నుంచి ఎంపీటీ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019లో పెనమలూరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.
అయితే 2019లో గెలుపొందిన తర్వాత పార్థసారథి మంత్రి పదవి ఆశించారు. కానీ జగన్ ఆయనకు మంత్రిగా అవకాశం ఇవ్వకుండా పక్కకు పెట్టేశారు. అప్పటి నుంచే పార్థసారథి అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీ టికెట్ కూడా నిరాకరించడంతో పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో మంగళవారం టీడీపీ నేతలు వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, బొమ్మసాని సుబ్బారావులు పార్థసారధితో చర్చలు జరిపి.. తెలుగు దేశం పార్టీలోకి ఆహ్వానించారు. అటు పార్థసారధి కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది.
అయితే టీడీపీ నేతలు వెళ్లి పార్థసారథితో చర్చలు జరిపిన విషయం తెలిసి.. వైసీపీ నేతలు కూడా వెళ్లి ఆయన్ను కలిశారు. వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్లు పార్థసారథిని కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. వైసీపీలోనే కొనసాగాలని కోరారు. రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధినేత జగన్ ఆశించిన పదవిని ఇస్తారని చెప్పారట. అయినప్పటికీ పార్థసారథి వెనక్కి తగ్గకపోవడంతో.. మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చారట. కానీ పార్థసారథి మెండి పట్టు పట్టుకొని పార్టీ మారేందుకు సిద్ధమయ్యారట.
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల వారీగా రా.. కదలి రా పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఈనెల 18న గుడివాడలో టీడీపీ బహిరంగ సభ జరగనుంది. ఆ సభలో చంద్రబాబు సమక్షంలో పార్థసారథి తెలుగు దేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE