ప్రజలను పల్లకి ఎక్కించడానికి, వారిని పల్లకీలో కూర్చోబెట్టడానికి జనసేన పార్టీ కృషి చేస్తుంది తప్ప ఎవరి పల్లకీలు మోయడానికి సిద్ధంగా లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని, రాని ప్రభుత్వం కోసం అధికారులు తపన పడొద్దని పవన్ కళ్యాణ్ అన్నారు. అన్నంపెట్టే రైతుకి కులం లేదని, అనంతపురంలో ఏప్రిల్ 12వ తేదీ నుంచి కౌలు రైతు కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. మరోవైపు జనసేన పార్టీ తరపున చేపట్టిన రైతులను ఆదుకునే కార్యక్రమం కోసం పవన్ కళ్యాణ్ తన వంతు సాయంగా రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ కోశాధికారి ఎం.వి రత్నంకు పవన్ కళ్యాణ్ అందజేశారు.
“చాలా మంది మేధావులు మీరు పార్టీ ఏలా నడుపుతారని అడుగుతున్నారు. మనకన్నా ముందు కాన్షిరాం స్ఫూర్తితో చాలా పార్టీలు వచ్చాయి కానీ నిలబడలేకపోయారు. ఒక పార్టీ నిలబడాలి అంటే ఒత్తిళ్లను తట్టుకునే మానసిక స్థిర్యంతో పాటు అందరినీ ఏకం చేసే భావజాలం కావాలి. 8 ఏళ్లుగా పార్టీని నడపడం అంటే సామాన్య విషయం కాదు. మనస్ఫూర్తిగా మనల్ని మనం అభినందించుకోవాలి. ఈ ప్రయాణంలో తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
“ఈ రోజు ఒక ముద్ద తినగలుతున్నాం అంటే దానికి కారణం కౌలు రైతే. అలాంటి కౌలు రైతులు వేలల్లో ఆత్మహత్యలు చేసుకోవడం బాధకలిగింది. కౌలు రైతుల సమస్య జనసేన సృష్టించింది కాదు. వాళ్ల ఆత్మహత్యలకు కారకులు వైసీపీ నాయకులే. కర్నూలు జిల్లాలో 353 మంది, అనంతపురంలో 178మంది, ఉభయ గోదావరి జిల్లాల్లో 81 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అందరూ కూడా వివిధ కులాలు, మతాలకు చెందిన వారు. 40 నుంచి 45 ఏళ్ల వయసు మధ్యవారు. అన్నం పెట్టే రైతులకు కులం లేదు. అలాంటి రైతులను కులంతో విభజించింది వైసీపీ పార్టీ, దగా పడ్డ రైతుకు అండగా నిలబడాలి. ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతులు వేలల్లో ఉన్నారు. వారందరి కుటుంబాలను ఆదుకోవడానికి అంత డబ్బు ఎక్కడ నుంచి తెస్తామని చాలా మంది అడుగుతున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది. మనసును కదిలించ గలిగితే డబ్బులు అవే వస్తాయి. నేను పాటించనిదే ఎవరీని ఏమీ అడగను. కష్టాల్లో ఉన్న వారికి మన వంతు సాయం చేయాలనే రూ.5 కోట్లు ఇచ్చాను. మనం ఇచ్చే లక్ష రూపాయలతో కౌలు రైతుల కుటుంబాల్లో అద్భుతాలు జరిగిపో తాయని చెప్పను. వాళ్ల ఒక్క కన్నీరు చుక్కను తుడవగలిగితే మా జీవితం ధన్యమైనట్లేనని నమ్మతాను. దేశం కోసం సమాజం కోసం చాలా మంది మహానుభావులు వారి ఆస్తులను విరాళంగా ఇచ్చేశారు. నాకు వాళ్లంత పెద్ద హృదయం లేకపోవచ్చు కానీ నా స్థాయిలో నేను చేస్తాను. ప్రకృతి విపత్తు నుంచి మొదలు కల్తీ విత్తు వరకు ముందు నష్టపోయేది రైతే. జనసేన చేపట్టిన రైతు భరోసా యాత్ర ఒక ఉద్యమంలా ముందుకు వెళ్లాలి. ఈ నెల 12న అనంతపురంలో మొదలుపెడతాం. కనీసం ఆ రోజు 30 మంది ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు నష్ట పరిహారం అందిస్తాం. అలాగే ఉత్తరాంధ్ర మూడు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెడతాను. రీజనల్ కార్యాలయం ఏర్పాటు చేస్తాం. అక్కడ యువతలో ధైర్యం నింపేందుకు నేనే వచ్చి కూర్చుంటాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ