వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అయ్యాయి. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను డబ్బులు తీసుకుంటున్నట్లు కూడా వదంతులు సృష్టిస్తున్నారని బాలినేని ఆరోపించారు. తాను ఇళ్ల పట్టాల పంపిణీ గురించి డబ్బులు తీసుకున్నట్లు తేలితే చెప్పుతో కొట్టమని హాట్ కామెంట్స్ చేశారు.
తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్న మనిషినని బాలినేని చెప్పుకొచ్చారు. పట్టాల పంపిణీని అడ్డుకుంటే వారి ఆఫీస్ను 75 వేల మందితో కలిసి ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఫిబ్రవరి 25వ తేదీలోపు సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ చేపడతామని చెప్పిన ఆయన.. పట్టాలతో పాటు ఇళ్లు కూడా నిర్మించేలా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. ఒంగోలు నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల ఇళ్ల పట్టాల పంపిణీపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన బాలినేని.. తనపై తప్పుడు రాతలు రాస్తే మాత్రం ఊరుకోబోనని వార్నింగ్ ఇచ్చారు.
ఇళ్ల పట్టాల పంపిణీని ఎవరైనా అడ్డుకుంటే సహించేది లేదని, వారి సంగతి తేలుస్తామంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయలేకపోతే మాత్రం రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పుకొచ్చారు. తాజాగా ఒంగోలు జిల్లాలోని అగ్రహారం, వెంగముక్కపాలెం , చినమల్లేశ్వపురం గ్రామాల్లోని ఇంటి స్థలాలను పేదలకు పంపిణీ చేయాలని జగన్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది.
దీని కోసం ఆ ఇంటి స్థలాలను చదును చేసి రోడ్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించగా… ఈ టెండర్ల కేటాయింపులోనే అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. అర్హత లేని కంపెనీలకు ఈ టెండర్లను అప్పగించారంటూ ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తనపై జరుగుతున్న ప్రచారంపై బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే అంతు చూస్తానంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు.తనపై ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా ఫర్వాలేదని, దీనిపై ముఖ్యమంత్రి జగన్ ఊరుకున్నా కూడా.. తాను మాత్రం వదిలేది లేదని బాలినేని హెచ్చరించారు.
మాగంటి విషయంలో వైసీపీ అధిష్టానం తీరుతో అసంతృప్తితో ఉన్న బాలినేని.. తన నియోజకవర్గమైన ఒంగోలుకు చాలా రోజుల తర్వాత వచ్చారు.గతేడాది డిసెంబర్ 12న తన బర్త్ డే వేడుకలను ఒంగోలులో జరుపుకొన్న బాలినేని.. ఆ తర్వాత 40 రోజుల పాటు నియోజకవర్గానికి రాలేదు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం వైసీపీ సర్కార్ రూ.201 కోట్లు విడుదల చేయడంతో జనవరి 23న బాలినేని నియోజకవర్గానికి వచ్చారు.
కానీ ఆ తర్వాత వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అధిష్టానం నియమించడంతో బాలినేని అసంతృప్తికి గురై హైదరాబాద్ వెళ్లారు. ఆ తర్వాత హైదరాబాద్, విజయవాడ తిరుగుతున్న బాలినేని.. చాలా రోజుల తర్వాత తన సొంత నియోజకవర్గానికి వెళ్లారు. అయితే జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్న బాలినేని.. వైఎస్సాసీపీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరతారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అధిష్టానం బుజ్జగింపులతో దారిలోకి వచ్చిన బాలినేని హాట్ కామెంట్లు చేసి హాట్ టాపిక్ అయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE