ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సొంతపార్టీలో అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో అలిగి పక్క పార్టీలకు వెళుతున్న నేతలతో కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఇన్నాళ్లూ జెండా మోసిన తమకు కాకుండా ఎన్నికల ముందు పార్టీ కండువా కప్పుకున్న వాళ్లకు సీటెలా ఇస్తారంటూ నేతలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా టీడీపీలోనూ ఇదే విషయంపై గడబిడ మొదలైంది.
తాజాగా..తాజా మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం రాకపై గుంతకల్లు టీడీపీ శ్రేణులు తీవ్రంగా అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. గుమ్మనూరు రాకను వ్యతిరేకిస్తూ ఏకంగా.. నేతలు, కార్యకర్తలు ఆందోళనలు కూడా చేపట్టారు. గుమ్మనూరుకు టికెట్ ఇస్తే ఊరుకునేదే లేదని అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు.
కొద్ది రోజులుగా సాగుతున్న ఊహాగానాలు, రాజకీయ చర్చలకు తెరదించిన ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సైకిలెక్కేసారు. మంగళవారం జరిగిన జయహో బీసీ సభలో చంద్రబాబు సమక్షంలో తెలుగు దేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. జయరాంతో పాటు ఆయన అనుచరులకు టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు కడువా కప్పి తమపార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా..ఈ ఎన్నికల్లో గుంతకల్లు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయబోతున్నట్లు గుమ్మనూరు జయరాం ప్రకటించడమే ఇప్పుడు రాజకీయంగా హీటు పెరగడానికి కారణం అయింది. దీనిపై తనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి హామీ లభించిందని జయరాం చెప్పుకొచ్చారు. దీంతో తాను పుట్టిన ఊరుకి సేవ చేసుకునే అవకాశం లభిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన వరకూ ఇది సంతోషించదగ్గ విషయమే అయినా ..ఇటు గుమ్మనూరు రాక, గుంతకల్లు టీడీపీలో కాక పుట్టిస్తోందన్న వాదన వినిపిస్తోంది.
గుమ్మనూరు జయరాం రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానిక తెలుగు తమ్ముళ్లు బాహాటంగా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు టీడీపీపై ఇష్టానుసారం మాట్లాడిన వ్యక్తి.. వైసీపీ వద్దనుకున్న జయరాం..ఇప్పుడు టీడీపీకి మాత్రం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. గుమ్మనూరు రాకతో పార్టీకి నష్టం జరుగుతుంది తప్ప ఏమాత్రం ప్రయోజనం లేదని తేల్చి చెబుతున్నారు.తమ నిరసన గళాన్ని వినిపించడానికి గుంతకల్లు టీడీపీ ఆఫీసు ముందు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వర్గీయులు ఆందోళన చేపట్టారు. జయరాంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చంద్రబాబుతో పాటు కుటుంబ సభ్యులను తీవ్రంగా దూషించిన జయరామ్ను..చంద్రబాబు ఏవిధంగా పార్టీలో చేర్చుకున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ తమను కాదని..జయరాంకు కనుక గుంతకల్లు టికెట్ ఇస్తే గ్యారంటీగా ఓడించి తీరుతామని శపథం చేస్తున్నారు. మొత్తంగా గుమ్మనూరు రాక సైకిల్ టీడీపీలో కొత్త రచ్చకు దారి తీసినట్లే అయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE