జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయ వారాహి యాత్రను మళ్లీ మొదలు పెట్టడానికి రంగం సిద్ధం అయింది. నిజానికి సెప్టెంబర్ నెలాఖరుకు మూడోవిడత వారాహి యాత్రను ప్రారంభించాలని అనుకున్న పవన్ .. షూటింగ్స్ వల్ల కొద్ది రోజులు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. దీంతో మరోసారి అక్టోబర్ నుంచి తన యాత్రను కంటెన్యూ చేయడానికి షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు.
దీంతో అక్టోబర్ 1 నుంచి అవనిగడ్డ నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పవన్ విజయ వారాహి యాత్రను మొదలుపెట్టేలా.. మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గ రూట్ మ్యాప్ను జనసేన సిద్ధం చేసింది.పవన్ వారాహి యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లా కీలక నాయకులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని నిర్వహించారు.
మరోవైపు అర్ధాంతరంగా నిలిచిపోయిన నారా లోకేష్ యువ గళం పాదయాత్ర కూడా మళ్లీ మొదలు కాబోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టు చేయడంతో లోకేష్ తన పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు అప్పుడు ప్రకటించారు.పూర్తిగా చంద్రబాబు బెయిల్ ప్రయత్నాల్లోనే లోకేష్ నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న లోకేష్..తన యువగళం పాద యాత్రను మళ్లీ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు.
ఈ యాత్రకు బ్రేకులు వేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. లోకేష్ అరెస్టు భయంతో పరారీలో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. దీంతో మరోసారి యువ గళం పాదయాత్రను మొదలుపెట్టి జనాల్లోకి వెళ్లి చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై ప్రజల్లో సానుభూతిని సంపాదించాలనే లోకేష్ ఆలోచిస్తున్నారు. ఇదే సమయంలో అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు కేసులో ఏ 14గా ఉన్న లోకేష్ను ఈ రోజో, రేపో అరెస్ట్ చేయడం గ్యారంటీ అన్న వార్తలు కూడా జోరందుకున్నాయి.
అన్నీ లోకేష్ అనుకున్నట్లే జరిగితే.. యువ గళం పాదయాత్రను కూడా అక్టోబర్ మొదటి వారంలోనే ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిలిచిపోయిన యాత్రను..అక్కడ నుంచే మళ్లీ ప్రారంభించాలని లోకేష్ డిసైడ్ అయ్యారు. గతంలోనే యువ గళం పాదయాత్రకు విశేషమైన స్పందన వచ్చిందని, ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో ఇంకా ప్రజల నుంచి తనకు మద్దతు ఎక్కువగా లభించే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఇలా జనం మధ్యలోనే ఉండగానే లోకేష్ను అరెస్ట్ చేస్తే అది చంద్రబాబు కుటుంబానికి, పార్టీకి మరింత సానుభూతి పెరిగేలా చేస్తుందనే అంచనాలో టీడీపీ వర్గాలు ఉన్నాయి.
మరోవైపు చంద్రబాబు అరెస్టును ఖండించి..టీడీపీతో పొత్తు అంశాన్ని ప్రస్తావించిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత సైలెంట్ అవడంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. దీంతోనే ఆరు నూరైనా.. నూరు ఆరైనా అక్టోబర్ 1 నుంచి వారాహి యాత్రను మొదలు పెట్టాలని జనసేన నిర్ణయించింది. దీంతో ఒకేసారి ఇటు పవన్..అటు లోకేష్ యాత్రలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కించడానికి రెడీ అవుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE