అంతా అనుకున్నట్లే టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదరడం..లోగో మారడం జరిగిపోయాయి. అధికార పార్టీ, కూటమి నేతల ట్వీట్లతో సోషల్ మీడియా పోటెత్తింది. అయితే ఇప్పుడే మరో వాదన తెర మీదకు వచ్చింది. మరి కూటమి మధ్య పవర్ షేరింగ్ ఫార్ములా ఏంటి అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మూడు పార్టీల నేతలు ముందు పొత్తు పెట్టుకుందామని చేతులు కలిపారు. అటు పవన్ కళ్యాణ్ ఎలాగూ ఎన్డీఏలోనే ఉన్నారు కాబట్టి.. చంద్రబాబును కమలం పార్టీ ఎన్టీఏలోకి ఆహ్వానించింది. ఇప్పుడు లేటుగా అయినా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సెట్ అయింది. 30 అసెంబ్లీ సీట్లు, ఎనిమిది ఎంపీ సీట్లు జనసేన, బీజేపీకి ఉంచి.. మిగిలిన సీట్లలో టీడీపీ పోటీ చేయబోతోంది.
అయితే జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలలో పోటీ చేయబోతున్నట్లు ముందే ప్రకటించింది. దీంతో బీజేపీకి ఆరు అసెంబ్లీ, ఐదు ఎంపీ సీట్లు ఇస్తారా..? లేక ఈ లెక్కలో మార్పులుంటాయా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.ఇదే సమయంలో కూటమిలో సీటు షేరింగ్ ఓకే.. మరి పవర్ షేరింగ్ ఫార్ములా ఎలా ఉంటుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. టీడీపీ, బీజీపీ, జనసేన కూటమి గెలిస్తే.. సీఎం పదవిని మూడు పార్టీలు పంచుకుంటాయా? ఏపీ మంత్రివర్గంలో బెర్తుల షేరింగ్ ఉంటుందా? ఉండదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన,బీజేపీ, ఎన్సీపీ ఈ మూడు పార్టీల కూటమిని ఒకసారి చూస్తే.. శివసేన నుంచి ముఖ్యమంత్రి పదవి, బీజేపీ,ఎన్సీపీ డిప్యూటీ ముఖ్యమంత్రుల పదవులను షేర్ చేసుకున్నాయి.ఆంధ్రప్రదేశ్లోనూ అదే ఫార్ములాని వర్తింపజేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కూటమిలో జనసేన అధినేత పవన్ని ఎలా సంతృప్తిపర్చగలరనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరోవైపు పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? ఎన్ని స్థానాలలో పోటీ చేస్తారు? ఒకవేళ రెండు స్థానాల్లో పోటీ చేస్తే.. రెండూ ఎమ్మెల్యే స్థానాలా లేక ఒకటి ఎంపీ, ఒకటి ఎమ్మెల్యేనా అన్న క్లారిటీ లేక జనసేన నేతలు అయోమయానికి లోనవుతున్నారు. ఇదిలావుంటే పొత్తులో ఎక్కువగా కోల్పోతుంది పవన్ కళ్యాణే అన్న టాక్ నడుస్తోంది ఎందుకంటే ఇటు లోకల్ పార్టీగా టీడీపీ కోసం తక్కువ ఎమ్మెల్యే సీట్లతో రాజీ పడ్డారు.
ఇటు చూస్తే.. కూటమి వల్ల బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లను వదులుకోవాల్సి వస్తోంది. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పవన్ భీమవరం నుంచా, పిఠాపురమా? తిరుపతా? ఎక్కడి నుంచి పోటీకి దిగుతారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పుడు కూటమి కన్ఫామ్ అయింది కాబట్టి..పవన్ని ఎంపీగా పోటీ చేయిస్తే ఏపీలో ఎలాంటి ఫలితం ఉన్నా.. పవన్ గెలిస్తే కనుక కేంద్రంలో బీజేపీ వస్తే జనసేనానికి సెంట్రల్ మినిస్టర్ పదవి పక్కా అన్న టాక్ నడుస్తోంది. ఇదొక్కటే పవన్కు ప్లస్ అవబోతుంది.
ఈ కూటమికి మరో సవాల్ కూడా ఎదురవుతోంది. తెలంగాణలో కూడా కూటమి ఉంటుందా? ఎన్డీఏ అంటే ఒక రాష్ట్రానికే పరిమితం కాదన్న విషయం తెలిసిందే.మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ,బీజేపీ పొత్తుతోనే ఎన్నికల బరిలోకి దిగాయి. ఇప్పుడు ఏపీలో బీజేపీతో టీడీపీ కూడా కలిసింది . అయితే తెలంగాణలో టీడీపీకి కేడర్ బలం కూడా ఉంది కాబట్టి.. ఇక్కడ ఎన్డీఏ కూటమి పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసే అవకాశాలున్నాయి.
ముఖ్యంగా ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ ప్రభావం చూపించే చాన్సు ఉంది. మల్కాజ్గిరి, మెదక్ నియోజకవర్గాలలో కూడా టీడీపీకి పట్టుంది. దీంతో బీజేపీ తెలంగాణలో కూడా టీడీపీ జత కట్టాలని ఒత్తిడి చేసే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. అందుకే తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కాషాయ పార్టీకి 400 సీట్లు గెలిచే సత్తా ఉంటే పొత్తులు ఎందుకంటూ కౌంటర్ వేసినట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ