కంటైన్మెంట్ జోన్లలో మినహా ఈ నెల 8వ తేదీ నుంచి మతపరమైన ప్రదేశాలు/ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తెరిచేందుకు కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 8 నుంచి లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 5, శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కూడా హోటల్స్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ సోమవారం నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో ఆయా ప్రదేశాల్లో పాటించాల్సిన నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్ల మినహా మిగిలిన ప్రాంతాల్లో జూన్ 10 నుంచి ఆలయాల్లో భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ముందుగా 8,9 తేదీల్లో ఆలయ సిబ్బంది, స్థానిక భక్తులతో దర్శనాలకు అనుమతించి లోటుపాట్లను సరిచేసి, 10వ తేదీ నుంచి భక్తులందరికీ దర్శనాలకు అనుమతి ఇస్తామని చెప్పారు.
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు:
- ప్రార్థన మందిరాల వద్ద భక్తుల కోసం ప్రత్యేక ప్రవేశం మార్గం మరియు బయటకు వచ్చేందుకు వేర్వేరు మార్గాలు ఉండాలి.
- ఎంట్రీ వద్ద తప్పనిసరిగా శానిటైజర్ డిస్పెన్సర్ మరియు థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి.
- క్యూలైన్స్ లో తగినంత దూరంతో భౌతిక దూరం పాటించేలా మార్కులు గీయాలి. క్యూలో నిలబడినప్పుడు అన్ని సమయాల్లో కూడా కనీసం 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి.
- భక్తి గీతాలను ఆలపించడానికి వీలులేదు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా శఠగోపం, తీర్ధం ఇవ్వరు.
- విగ్రహాలు, పవిత్ర గ్రంథాలను తాకడానికి అనుమతించకూడదు.
- హోటల్స్ సిబ్బంది ఖచ్చితంగా గ్లోవ్స్, మాస్కులు ధరించాలి. రెస్టారెంట్స్ లో సీట్లు కూడా దూరంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలి.
- షాపింగ్ మాల్స్లోనూ భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలి.
- ఎయిర్ కండిషనింగ్ / వెంటిలేషన్ కోసం సిపిడబ్ల్యుడి యొక్క మార్గదర్శకాలను అనుసరించాలి.
- 10 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు బహిరంగ ప్రదేశాలలోకి అనుమతి లేదు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu