వైసీపీలో టికెట్ దక్కలేని నేతలంతా టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. వైనాట్ 175 అంటూ లెక్కలేస్తున్న జగన్కు ఇప్పుడే సీన్ రివర్స్ అయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ వైపు వెళ్లలేని వాళ్లు స్వతంత్ర అభ్యర్ధిగా అయినా సరే నిలబడతామని వైసీపీ నుంచి బయటకు వస్తుంటే వైసీపీ అధినేత పరిస్థితి కక్కలేక , మింగలేక అన్నట్లుగా తయారవుతోంది. తాజాగా మరో సీనియర్ నేత సైకిల్ వైపు చూడటంతో.. వైసీపీలో గుబులు మొదలయింది.
వైసీసీలో తనకు టికెట్ దక్కదన్న సంకేతాలు వస్తుండటంతో.. ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీతో టచ్లో ఉన్నారట.. కనిగిరి సభలో వైసీపీ ఎమ్మెల్యేలను విమర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. తనను తిట్టాలని వైసీపీ ఆదేశించినా మాగంట తనను తిట్టలేదంటూ ప్రత్యేక అభినందనలు చెప్పడం ఈ ప్రచారానికి మరింత ఊతం ఇచ్చినట్లు అయింది. దీంతో మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీ వైపు చూస్తున్నారంటూ వార్తలు జోరందుకున్నాయి. అయితే దీనికి వైసీపీలో టికెట్ రాకపోతే టీడీపీ వైపు వెళితే తప్పేంటని మాగుంట అభిమానులు ఓపెన్గానే చెబుతున్నారట.
మొత్తానికి ఒంగోలులో వైఎస్సార్సీపీ నుంచి పార్లమెంట్కు, అసెంబ్లీకి కలిసి పోటీ చేయాలని భావిస్తున్న మాగుంట, బాలినేని కాంబినేషన్కు ఈ అసెంబ్లీ ఎన్నికలలో మరోసారి బ్రేక్ పడనున్నట్టు కనిపిస్తోంది. వైసీపీ టికెట్ కోసం చివరి వరకు ఎదురు చూడాలని మాగుంటకే బాలినేనినే సూచించారట. దీంతో రెండు రోజులు హైదరాబాద్లో ఉండి మరీ మంతనాలు జరిపినా వైసీపీ నుంచి ఎలాంటి పాజిటివ్ సంకేతాలు అందకపోవడంతో.. టీడీపీకి టచ్లోకి వెళ్లిపోయారట
టీడీపీ నుంచి మాగుంటకు సానుకూల సంకేతాలు అందాయని.. ఒంగోలు లేదా నెల్లూరు నుంచి పోటీ చేయడానికి సిద్దంగా ఉండాలని టీడీపీ నుంచి ఇప్పటికే మాగుంట శిబిరానికి సూచనలు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో మాగుంట తన ఫ్యామిలీ నుంచి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీ చేయించాలని భావిస్తున్నారట. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలంటే చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ను మాగుంట తిట్టాలని జగన్ షరతు విధించారట. కానీ మాగుంట.. జగన్ మాటను ధిక్కరించడంతో మాగుంట వైపు టీడీపీ దృష్టి సారించిందట. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన ఎన్నికల శంఖారావం సభలో.. తనను, లోకేష్ను, పవన్ను తిడితేనే ఎంపీ సీటు ఇస్తానని జగన్ చెబితే, మాకు సంస్కారం ఉంది.. మేం అలా తిట్టమని చెప్పిన ఎంపీ, ఎమ్మెల్యేలను అభినందించాలని చంద్రబాబు తన కార్యకర్తలకు పిలుపునివ్వడం దీనిలో భాగమేనట.
నిజానికి 2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్పై ఎంపీగా పోటీ చేయడానికి మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రయత్నించారు. ఎందుకంటే 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన మాగుంట.. ఏపీ రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు కావడంతో.. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే వైవీ సుబ్బారెడ్డిని పార్లమెంట్ నుంచి పోటీ చేయించడానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించుకోవడంతో మాగుంటకు ఛాన్స్ దక్కలేదు. దీంతో టీడీపీలో చేరిన మాగుంట కేవలం 40 వేల ఓట్ల తేడాతో వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు.
ఆ తరువాత 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మాగుంటకు ..వైవీ సుబ్బారెడ్డిని కాదని వైసీపీ అధిష్టానం ఎంపీ టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో మాగుంట 2 లక్షల మెజారిటీతో విజయం సాధించారు. అప్పటి నుంచి వైసీపీ ఎంపీగా కొనసాగుతున్న మాగుంట.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తన వారసుడు రాఘవరెడ్డిని పోటీకి నిలబెడుతున్నట్టు ప్రకటించారు. కానీ ఈసారి కూడా మాగుంట కుటుంబానికి వైవీ సుబ్బారెడ్డి రూపంలోనే అడ్డంకి ఎదురైంది.సుబ్బారెడ్డికి అయినా ఆయన కుమారుడు వైవీ విక్రాంత్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి జగన్ మొగ్గు చూపుతున్నారు. దీంతోనే మాగుంట మళ్లీ టీడీపీలోకి వెళ్లి తన కొడుకుని పోటీకి దింపాలని చూస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE