అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ అధికారంలో దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. సౌత్లో ఫుల్ జోష్ మీద కనిపిస్తోంది. త్వరలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలను సాధించి మరింత పట్టు సాధించాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది.
ఫిబ్రవరి చివరి వారం లేదంటే.. మార్చిలో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమ వ్యూహాలకు పదునుపెడుతూ.. కసరత్తు ముమ్మరం చేసింది. మిత్రపక్షాలతో సీట్ల సర్ధుబాటు అంశం కూడా తుది దశకు వచ్చేయడంతో.. పార్లమెంట్ ఎన్నికలకు రాష్ట్రాల వారీగా ఎలక్షన్ కమిటీలను ఏర్పాటు చేసింది.
దీనిలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టాస్క్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ లోక్సభ ఎన్నికల బాధ్యతను అప్పజెప్పిన అధిష్టానం..దీంతో పాటు ఏపీ ఎలక్షన్ కమిటీ ఛైర్మన్గా రేవంత్ రెడ్డినే నియమించింది. ఈ కమిటీలో డిప్యూటీ ముఖ్యమంత్రి సహా..కొంతమంది మంత్రులు, సీనియర్ నాయకులకు చోటు కల్పించింది.
తెలంగాణ శాసనసభ ఎన్నికల టైంలో తన సత్తా చూపించుకోవడంతో అధిష్టానం.. ఈ సారి కూడా పూర్తి భారం రేవంత్రెడ్డి పైనే వేసింది. ప్రస్తుతం సౌత్ రాజకీయాలలో కాంగ్రెస్ పూర్తిగా పట్టు సాధించినట్లే అయింది. తెలంగాణ,కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయాన్ని సాధించగా.. తమిళనాడులో మిత్రపక్షం డీఎంకే అధికారంలో ఉంది. అటు కేరళలోనూ కాంగ్రెస్కు మంచి ఫలితాలే వస్తాయని ఆశిస్తున్నారు.
ఇటు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉండటంతో..వాటిలో 12 స్థానాలు ఎలా అయినా చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ స్కెచ్ వేస్తోంది. దీనిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల కమిటీ ఛైర్మన్గా కొత్త బాధ్యతలను అప్పగించింది. దీంతో లోక్సభ సభ్యులను ఎంపిక చేసి.. వారి బలాబలాలు, సామాజిక సమీకరణాలు అన్నీ రేవంత్ రెడ్డి విశ్లేషించి ఏఐసీసీకి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.
రేవంత్ రెడ్డి అందించే నివేదిక ఆధారంగానే ..ఇప్పుడు అధిష్టానం లోక్ సభ అభ్యర్థులను ఖరారు చేయనుంది. అంతేకాదు ఇప్పుడున్న ఎన్నికల కమిటీలో ఉన్న కొంతమంది సభ్యులు కూడా లోక్సభ టికెట్ రేసులో కూడా ఉన్నారు. జానారెడ్డి, బలరాం నాయక్, అంజన్ కుమార్ యాదవ్, వంశీచంద్ రెడ్డి వంటి కొంతమంది నేతలు లోక్సభ టికెట్ ఆశిస్తున్నారు.
ఐతే లోక్సభ ఎన్నికల బాధ్యత తీసుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడే అసలు సవాళ్లు ఎదురవుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే శాసనసభ ఎన్నికలతో కంపేర్ చేస్తే.. పార్లమెంట్ ఎన్నికలు పూర్తిగా డిఫరెంట్. ఓటర్ల తీరు కూడా వేరేలా ఉంటుంది. అందుకే తీర్పు కూడా అసెంబ్లీ ఎన్నికలలో ఉన్నట్లు ఉండదు. ఢిల్లీ లెవల్లో ఆలోచించి మరీ జనాలు ఓట్లు వేస్తారు.
దీనికి బీజేపీని ఉదాహరణగా తీసుకుంటే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసీట్లు మాత్రమే గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా నాలుగు స్థానాల్లో పాగా వేసింది. దీనిని బట్టి జనాల మూడ్ ఎలా ఉంటుంది అర్థం చేసుకోవచ్చు. పైగా ఈసారి శాసనసభ ఎన్నికల్లో పెరిగిన ఓటు బ్యాంక్ కమలం పార్టీలోనూ కొత్త జోష్ నింపింది. 10 స్థానాల్లో విజయం సాధించే దిశగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాఠం నేర్చుకున్న బీఆర్ఎస్ .. లోక్సభ ఎన్నికల్లో ఎలా అయినా తమ పరువు నిలబెట్టుకోవాలని ఫిక్స్ అయింది. ఇలాంటి రాజకీయ పరిస్థితులు, రాజకీయనేతల మధ్య గట్టి పోటీ నెలకొన్న ఈ సమయంలో.. కాంగ్రెస్కు తెలంగాణ నుంచి మెజారిటీ సీట్లు గెలిపించాలని అధిష్టానం బాధ్యతలు అప్పగించమనేది నిజంగా రేవంత్కు పెద్ద పరీక్షగానే చెప్పాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE