తెలంగాణలో పొలిటికల్ హీట్ రోజురోజుకు రెట్టింపు అవుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. రాజకీయ నాయకులు ఇళ్లు మారినంత సింపుల్గా పార్టీలు మారుతూ హీట్ పెంచుతున్నారు. నిన్న ఉన్న వాళ్లు ఈరోజు ఆ పార్టీలో ఉండడం లేదు. ఇప్పటికే అన్ని పార్టీల నుంచి అసంతృప్తులంతా ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు. మరికొంత మంది కూడా పార్టీ మారేందుకు రెడీ అయిపోతున్నారు. టికెట్ దక్కలేదని.. పదవులు దక్కలేదని.. ముందు నుంచి నమ్ముకొని ఉన్న పార్టీలకు గుడ్ బై చెబుతున్నారు.
ఇకపోతే కొద్దిరోజులుగా రాష్ట్రంలో బీజేపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. రోజురోజుకు వెనుకబడిపోతోంది. బీజీపీ గ్రాఫ్ అనూహ్యంగా పదిలోపు వడిపోయింది. ఎప్పుడైతే రాష్ట్ర బీజేపీ అధ్యుక్షుడిగా బండి సంజయ్ను తప్పించి.. కిషన్ రెడ్డిని నియమించారో.. అప్పటి నుంచి పార్టీ పతనం ప్రారంభమయింది. రోజురోజుకు పార్టీ బలహీనపడిపోతుంది. ఎన్నికల సమయంలో అధిష్టానం ఈ మార్పు చేయడంతో ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది. అటు కిషన్ రెడ్డి కూడా పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయి.
మొన్నటి వరకు పలువురు దిగ్గజ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు కిషన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి నేతలకు ఆహ్వానం పలికారు. కానీ వారు బీజేపీని కాది.. కాంగ్రెస్ వైపు మెగ్గుచూపారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే ఇప్పుడు కిషన్ రెడ్డి పెద్ద తలనొప్పి వచ్చి పడింది. ఇతర పార్టీల్లో నుంచి కొత్త వారిని చేర్చుకోవడం కాదు కదా.. పార్టీలో ఉన్న కీలక నేతలను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
బీజేపీలో కీలకంగా ఉన్న నలుగురు నేతలు పార్టీని వీడడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, ఏనుగు రవీంద్ర రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారట. పార్టీ మారాలని ఈ నలుగురు నేతలు నిర్ణయించుకున్నారట. అందుకే ఇటీవల కిషన్ రెడ్డి నిర్వహించిన తెలంగాణ పతాధికారుల సమావేశానికి ఈ నలుగురు డుమ్మా కొట్టారు. అటు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో కూడా ఎక్కడా కనిపించలేదు.
అటు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు వంటి దిగ్గజ నేతలతో పాటు నియోజకవర్గాల స్థాయిలో కూడా పెద్ద ఎత్తున నేతలు చేరడంతో కాంగ్రెప్ ఫుల్ జోష్లో ఉంది. బీఆర్ఎస్ను ఢీ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, ఏనుగు రవీంద్ర రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంచి ఫామ్లో ఉన్న కాంగ్రెస్ వైపు చూస్తున్నారట. త్వరలో బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లోకి జంప్ అవ్వనున్నారట. కాంగ్రెస్లోకి ఈ నలుగురి చేరిక దాదాపు ఖాయమైనట్లేనని టాక్ వినిపిస్తోంది.