సాధారణ ఎన్నికలకు ఇంకా 8 నెలలు, తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల గడువుండగా పార్టీ రాష్ట్ర శాఖల అధ్యక్షులను మార్చింది బీజేపీ అధిష్టానం. దాంతో ఈ నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. గత కొన్నిరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణాలో నాయకత్వం మార్పు గురించి అందరూ ఊహించినట్టుగానే బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చారు. కిషన్ రెడ్డి నియామకం ద్వారా తెలంగాణాలో కాంగ్రెస్ ని అడ్డుకునే యత్నంలో ఉన్నట్టు ప్రచారం మొదలయ్యింది. ముఖ్యంగా వెలమకు వ్యతిరేకంగా రెడ్డి కులస్తులందరినీ సమీకరించాలనే యత్నం కాంగ్రెస్ చేస్తోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఇప్పటికే రెడ్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు కూడా చేసి ఉన్నారు. దాంతో ఇప్పుడు కిషన్ రెడ్డిని తెరమీదకు తీసుకురావడం ద్వారా రెడ్డి ఓట్లలో చీలిక తెచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తోందని అంచనా వినిపిస్తోంది.
వాస్తవానికి కర్ణాటక ఎన్నికల ముందు వరకూ తెలంగాణా బీజేపీలో ఉత్సాహం కనిపించింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే మునుగోడు ఎన్నికలకు ముందూ, తర్వాత అన్నట్టుగా తెలంగాణా బీజేపీ పరిస్థితి ఉంది. వరుసగా మునుగోడులో ఓటమి, కర్ణాటకలో అధికారం కోల్పోవడం బీజేపీ శిబిరంలో కలకలం రేపింది. ఆపార్టీ నుంచి నాయకులు చేజారిపోతారనే ప్రచారం మొదలయ్యింది. అసంతృప్తులు బయటపడ్డాయి. పార్టీలో బండి సంజయ్ కి వ్యతిరేకంగా రఘునందన్ రావు లాంటి వాళ్లు అవినీతి ఆరోపణలు కూడా గుప్పించారు. దాంతో బీజేపీ కూడా తన వైఖరిని మార్చుకుని కేసీఆర్ తో సఖ్యతగా మెలుగుతుందా అనే అనుమానాలు కూడా బయలుదేరాయి. తెలంగాణాలో కాంగ్రెస్ ని అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోందని కొందరు వాదిస్తున్నారు. అందుకు అనుగుణంగా కాంగ్రెస్ అనుకూలంగా ఉంటారనే రెడ్డి ఓటర్లను ప్రభావితం చేసేలా కిషన్ రెడ్డి డిల్లీ రాజకీయాల నుంచి మళ్లీ తెలంగాణా రాజకీయాలకు మళ్లించడం ఆసక్తిని రేకిత్తిస్తోంది.
అదే సమయంలో ఏపీలో పురందేశ్వరికి పట్టం కట్టడం ద్వారా తెలుగుదేశం వెనుక ఉన్న కమ్మ ఓట్లను చీల్చే ప్రయత్నమా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ఏపీలో బీజేపీకి చాలాకాలం పాటు కమ్మ నేతలు నాయకత్వం వహించారు. కానీ గడిచిన కొన్నేళ్లుగా కాపులకు నాయకత్వ బాధ్యతలు దక్కాయి. వరుసగా ఇద్దరు కాపు నేతలు ఏపీ బీజేపీకి అధ్యక్షులయ్యారు. కానీ ఇప్పుడు కాపు కులానికి చెందిన సోము వీర్రాజుని సాగనంపి కమ్మ పురందేశ్వరికి పగ్గాలు అప్పగించడం వెనుక బీజేపీ లక్ష్యం మీద రెండు వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీతో స్నేహం కోసమే బీజేపీ సోము వీర్రాజుని పక్కన పెట్టిందనే వాదన ఉంది. అదే సమయంలో కమ్మ ఓట్లను చీల్చి జగన్ కి మేలు చేసే ఉద్దేశంతోనే ఇలాంటి మార్పు చేసిందనే వాదన కూడా ఉంది.
ఏమయినా ఏపీ, తెలంగాణాలో రాష్ట్ర అధ్యక్షులను మార్చడం ద్వారా రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు మేలు చేసేలా బీజేపీ వ్యవహరిస్తోందనే వ్యాఖ్యానాలు వినిపించడం ఆసక్తికరమే. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో బలపడేందుకు బదులుగా కాంగ్రెస్ వంటి పార్టీలను అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదపడం ఆసక్తికరం. అదే సమయంలో ప్రాంతీయ పార్టీల మద్ధతు బీజేపీకి ఖాయంగా ఉండడంతో సొంత బలం అవసరం లేదని బీజేపీ అధిష్టానం భావిస్తూ ఉండవచ్చనే చర్చ కూడా సాగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE