ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దూకుడుగా ముందుకెళ్తున్నారు. మరోసారి అధికారం దక్కించుకోవడమే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తున్నారు. అందరికంటే ముందే తమ గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతున్నారు. ఇప్పటికే ఏడు విడతల్లో జగన్ అభ్యర్థులను ప్రకటించారు. పెద్ద ఎత్తున సిట్టింగ్లను మార్చి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఈసమయంలో సినీనటుడు ఆలీకి కూడా టికెట్ ఇస్తారని.. లోక్ సభ ఎన్నికల బరిలోకి దింపుతారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అటు ఆలీ కూడా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
గత ఎన్నికల ముందు ఆలీ వైసీపీలో చేరారు. ఆ సమయంలోనే ఆలీ టికెట్ ఆశించినప్పటికీ.. జగన్ అప్పుడు నిరాకరించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆలీ వైసీపీ నేతల గెలుపుకోసం ప్రచారం చేశారు. ముఖ్యమంగా మైనార్టీలు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో ఆలీ ప్రచారం నిర్వహించారు. వైసీపీ అభ్యర్థుల గెలుపుకోసం తీవ్రంగా చెమటోడ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఆలీ రాజ్యసభ టికెట్ ఆశించారు. కానీ జగన్ అప్పుడు కూడా మొండిచేయి చూపించారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ పదవిని ఆలీకి కట్టబెట్టారు.
ఇక కొద్దిరోజులుగా రాజకీయాల్లో చురుకుగా లేని ఆలీ.. ఎన్నికలు దగ్గరపడడంతో మరోసారి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అధినేత జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధమని తాజాగా ఆలీ ప్రకటించారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈవారంలోనే సీఎంవో నుంచి తనకు పిలుపు రావొచ్చని పేర్కొన్నారు. అటు పొత్తుల గురించి కూడా స్పందిస్తూ.. ఎంతమంది పొత్తుతో వచ్చినా అంతిమ విజయాన్ని నిర్దేశించి ఓటర్లేనని ఆలీ వివరించారు.
అటు జగన్ కూడా ఆలీని లోక్ సభ ఎన్నికల బరిలోకి దించే యోచనలో ఉన్నారు. మైనార్టీలు ఎక్కువగా ఉండే స్థానం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. అయితే మొన్నటి వరకు కూడా ఆలీకి నంద్యాల టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. అక్కడ మైనార్టీ ఓటర్లు అధికంగా ఉండడం.. ఆలీ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో గెలుపు సులభతరం అవుతుందని జగన్ అనుకున్నారు. కానీ ఇప్పుడు మరోస్థానం తెరపైకి వచ్చింది. నంద్యాల నుంచి కాకుండా.. కడప నుంచి ఆలీని పోటీ చేయించాలని జగన్ అనుకుంటున్నారట. ప్రస్తుతం కడప పార్లమెంట్ స్థానానికి వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన్ను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలో ఆ స్థానం నుంచి ఆలీని పోటీ చేయించాలని జగన్ అనుకుంటున్నారట. వైసీపీ ఎనిమిదో జాబితాలో కడప నుంచి ఆలీ పేరు ఉంటుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE