తళనాడులో రెండు, మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల రాకతో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా జనజీవనం స్థంభించింది. మిదీంతో రాజధాని చెన్నై మహానగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. చెన్నై శివారులో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగడంతో పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులన్నీ వర్షపు నీటితో నదులను తలపిస్తున్నాయి. వర్షం కారణంగా పలు కాలనీలు జలదిగ్బంధంలో మునిగి పోయాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించడం ప్రజలతో పాటు ప్రభుత్వానికి కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
ఇక ప్రభుత్వ నివేదికల ప్రకారం ఈ వర్షాల కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. సోమవారం రాత్రి ఒక వ్యక్తి విద్యుదాఘాతానికి గురవగా, నగరం యొక్క ఉత్తర ప్రాంతంలోని పులియంతోప్లో నివాస భవనం యొక్క భాగాలు కూలిపోవడంతో ఒక మహిళ మరణించింది. చెన్నైతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో వర్ష ప్రభావం అత్యధికంగా ఉంది. భారీ వర్షం ముప్పు పొంచి ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు ముందుగానే సెలవులు ప్రకటించింది. మరోవైపు చెన్నైలో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తడంతో నగరంలోని పలు ప్రైవేట్ కార్యాలయాలు మూత పడ్డాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించామని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని చెన్నై మున్సిపల్ అధికారులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE