భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ “కొవాగ్జిన్” పేరుతో కరోనాకు వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ విషయంలో భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసింది. కొవాగ్జిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి కోరుతూ అక్టోబర్ 2 వ తేదీన డీసీజీఐకి భారత్ బయోటెక్ దరఖాస్తు చేసుకోగా, పరిశీలన అనంతరం డీసీజీఐ అనుమతి మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది.
దేశంలో 10 రాష్ట్రాలలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు భారత్ బయోటెక్ దరఖాస్తులో తెలిపింది. ఢిల్లీ, ముంబయి, పాట్నా మరియు లక్నో వంటి 19 వేర్వేరు ప్రాంతాల్లో 18 సంవత్సరాల మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల 28,500 మందిపై ఈ క్లినికల్ ట్రయల్స్ జరపనున్నట్టు సమాచారం. మరోవైపు దేశంలో మరో రెండు కరోనా వ్యాక్సిన్స్ కూడా క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటున్నాయి. జైడస్ క్యాడిలా లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ 2 దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉండగా, ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన 2 మరియు 3 దశ క్లినికల్ ట్రయల్స్ పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu