కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆదివారం నాడు ట్విటర్ వేదికగా నిర్వహించిన సండే సంవాద్లో కరోనా వ్యాప్తి, చికిత్సలో ప్లాస్మా థెరపీ ఉపయోగం, కరోనా వ్యాక్సిన్ వంటి అంశాలపై పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. దేశంలో కరోనా వాక్సిన్ పంపిణీ ప్రాధాన్యతలపై మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ, ప్రస్తుతం కేంద్రం ఒక ఫార్మెట్ను రూపొందిస్తున్నదని, దీని ప్రకారం వాక్సిన్ అందుకునేందుకు ప్రాధాన్యత గల జనాభా గ్రూపుల గురించి రాష్ట్రప్రభుత్వాలు అక్టోబర్ చివరికల్లా జాబితాను సమర్పిస్తాయని అన్నారు. ముఖ్యంగా కరోనాపై పోరాటంలో ముందున్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, సర్వైలెన్స్ అధికారులు, ఇంకా కరోనా పేషెంట్ల గుర్తింపు, పరీక్షల నిర్వహణ, చికిత్స ప్రక్రియలో పనిచేస్తున్న వివిధ వర్గాల వారికీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. వాక్సిన్ను అందరికీ అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకునేందుకు కట్టుబడి ఉందని చెప్పారు.
2021 జూలై నాటికి సుమారు 20 నుంచి 25 కోట్ల మందికి కరోనా వాక్సిన్ వేయించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు. ఇందుకోసం 400-500 మిలియన్ల కరోనా వాక్సిన్ డోస్లను అందుకుని, ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు. వాక్సిన్ సేకరణ కేంద్రీకృత పద్ధతిలో జరగుతుందని, ప్రతి కన్సైన్మెంట్ను గుర్తించి, అది అత్యవసరమైన వారికి చేరేంతవరకు రియల్టైమ్ పద్ధతిలో ట్రాక్ చేయడం జరుగుతుందని అన్నారు. వాక్సిన్ బ్లాక్మార్కెట్కు వెళ్లే పరిస్థితి ఉండదని, వాక్సిన్ను ముందుగా నిర్ణయించిన ప్రాధాన్యతా క్రమం ప్రకారం, ప్రణాళికా బద్దంగా అందించడం జరుగుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu