సిడ్నీ వేదికగా శుక్రవారం నాడు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో 66 పరుగులతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా జట్టు 375 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 308 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ (74), ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (90) మాత్రమే రాణించారు. ఇక మిగిలిన వారిలో కెప్టెన్ విరాట్ కోహ్లి (21), మయాంక్ అగర్వాల్ (22), రవీంద్ర జడేజా (25) నవదీప్ సైనీ (29) పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 4, హజల్వుడ్ 3, స్టార్క్ ఒక వికెట్ తీశారు.
మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాళ్లలో కెప్టెన్ ఆరోన్ ఫించ్ (114), స్టీవ్స్మిత్(105) సెంచరీలతో ఆకట్టుకోగా, డేవిడ్ వార్నర్ (69), మాక్స్ వెల్ (45) పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా ఓపెనర్లు ఫించ్, వార్నర్ భారత్ బౌలర్లను దీటుగా ఎదుర్కుని మొదటి వికెట్ కు 156 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం స్టీవ్ స్మిత్, మాక్స్ వెల్ కూడా భారత్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొని పరుగులు సాధించడంతో 374 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచారు. ఇక భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 3 వికెట్లు తీయగా, బుమ్రా, నవదీప్ సైనీ, చాహల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో సెంచరీ సాధించిన స్టీవ్ స్మిత్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇక ఇరుజట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ నవంబర్ 29, ఆదివారం నాడు జరగనుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ