మహారాష్ట్రలో శనివారం ఘోర విషాదం చోటుచేసుకుంది. రాయగఢ్ జిల్లాలో పాత ముంబై-పూణే హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 27 మంది గాయపడ్డారు. దాదాపు 40 మంది ప్రయాణికులతో పూణె నుంచి ముంబై వెళ్తుండగా బస్సు లోయలో పడిపోవడంతో ఈ ఘటన జరిగింది. కాగా ముంబైకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖోపోలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది చోటుచేసుకుంది. కాగా ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో అంబులెన్సులను, వైద్య బృందాలను రప్పించి క్షతగాత్రులకు ప్రాథమిక వైద్య సహాయం అందించి ఆస్పత్రికి తరలించారు.
ఇక రాయ్గఢ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సోమనాథ్ ఘర్గే ఈ ప్రమాదం గురించి వివరాలు మీడియాకు వెల్లడించారు. ‘ముంబైలోని గోరేగావ్ నుండి ఒక ప్రైవేట్ బస్సు ‘బాజీ ప్రభు వాదక్ గ్రూప్’ అనే సంప్రదాయ సంగీత బృందం సభ్యులను తీసుకువెళుతోంది. పూణె జిల్లాలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని గోరేగావ్కు తిరిగి వస్తున్నారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో బస్సు వేదిక నుండి బయలుదేరింది. ఈ క్రమంలో తెల్లవారుజామున 4.50 గంటల ప్రాంతంలో హైవేపై షింగ్రోబా దేవాలయం సమీపంలోని లోయలో పడిపోయింది. వీరందరూ ముంబైలోని సియోన్ మరియు గోరేగావ్ మరియు పొరుగున ఉన్న పాల్ఘర్ జిల్లాలోని విరార్కు చెందినవారిగా గుర్తించడం జరిగింది. మరణించిన వారితో సహా గాయపడిన ప్రయాణికులు అందరూ 18-25 ఏళ్ల మధ్య వయస్కులుగా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వీరిని చికిత్స నిమిత్తం ఖోపోలి గ్రామీణ ఆసుపత్రికి తరలించాం’ అని పేర్కొన్నారు. కాగా ప్రమాద ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విచారం వ్యక్తం చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE