ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సమన్లు జారీ చేసింది. ఈ కేసుకి సంబంధించి ప్రశ్నించేందుకు ఏప్రిల్ 16న ఉదయం 11 గంటలకు ఆయన ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొంది. ఇక ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీబీఐ సిసోడియా రిమాండ్ రిపోర్టులో సీఎం కేజ్రీవాల్ పేరును ప్రస్తావించడం గమనార్హం. ఈ క్రమంలో తాజాగా దీనిలో సీఎం కేజ్రీవాల్ ప్రమేయంపై సాక్ష్యాలు సేకరించామని, ఆయనను ప్రశ్నించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని, అందుకే సమన్లు జారీచేశామని సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
కాగా మరోవైపు కేజ్రీవాల్కు ఇంకో కేసులోనూ సమన్లు అందాయి. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రభుత్వ ఆస్తులపై చట్టవిరుద్ధంగా పోస్టర్లు అంటించిన కేసులో గోవా పోలీసులు సీఆర్పీసీలోని 41(ఏ) సెక్షన్ కింద ఆయనకు సమన్లు జారీచేశారు. ఈనెల 27న తమ ముందు విచారణకు హాజరుకావాలని కోరారు. దీనిపై సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ గోవా పోలీసుల ముందు తాను విచారణకు కచ్చితంగా హాజరవుతానని శుక్రవారం తెలిపారు. ఈ క్రమంలోనే సీబీఐ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇక అంతకుముందు శుక్రవారం రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో దళితులు, బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందడం వారికి ఇష్టం లేదని, అందుకే ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి ఎంతో కృషిచేస్తున్న మనీశ్ సిసోడియాను జైలుకు పంపించారని విమర్శించారు. అయితే సోమవారం నాటి సీబీఐ విచారణకు సీఎం కేజ్రీవాల్ హాజరవుతారా? లేదా? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE