పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 29, శుక్రవారం నాడు ప్రారంభం అయ్యాయి. ఈ పార్లమెంట్ సెషన్ రెండు విడతలుగా జరగనుంది. మొదటి విడతలో జనవరి 29 నుండి ఫిబ్రవరి 15 వరకు మరియు రెండో విడతలో మార్చి 8 నుండి ఏప్రిల్ 8 వరకు జరగనుంది. రెండు విడతల్లో కలిపి మొత్తం 35 రోజులు సభ నిర్వహించనున్నారు. ముందుగా శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. “కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ పార్లమెంటు సమావేశాలు జరగడం అవసరం. కొత్త సంవత్సరంలో కొత్త దశాబ్దంలో మనం స్వాతంత్యం యొక్క 75 వ సంవత్సరంలోకి కూడా ప్రవేశిస్తున్నాము. ఎంత కఠినమైన సవాళ్లు ఎదురైనా కూడా భారతదేశం ముందుకు వెళ్తూనే ఉంటుంది” అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
“కరోనా కారణంగా చాలా మంది పౌరులను కోల్పోయాము. ఈ కరోనా కాలంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. అలాగే ఆరుగురు ఎంపీలు కూడా మరణించారు. వారందరికీ నా నివాళి అర్పిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న నిర్ణయాలు లక్షలాది మంది పౌరుల ప్రాణాలను కాపాడాయని భావిస్తున్నాను. కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య తగ్గుతోంది. అలాగే రికవరీల శాతం చాలా ఎక్కువగా ఉంది. మరోవైపు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం గర్వించదగ్గ విషయం” అని రాష్ట్రపతి చెప్పారు.
ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్:
మరోవైపు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కరోనా నిబంధనలను అనుసరించి పార్లమెంటులో అన్ని ఏర్పాట్లు చేశారు. లోక్సభ, రాజ్యసభ వేర్వేరు సమయాల్లో జరగనున్నాయి. రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్సభ సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ