ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హౌరా నుండి న్యూ జల్పాయిగురి వరకు నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించారు. జోకా-ఎస్ప్లానేడ్ మెట్రో ప్రాజెక్ట్ (పర్పుల్ లైన్) యొక్క జోకా-తరటాలా స్ట్రెచ్ను కూడా ప్రధాని ప్రారంభించారు. బోయించి-శక్తిగఢ్ 3వ లైన్, దంకుని-చందన్పూర్ 4వ లైన్ ప్రాజెక్ట్, నిమ్టిటా-న్యూ ఫరక్కా డబుల్ లైన్ మరియు అంబారి ఫలకతా-న్యూ మైనాగురి-గుమానిహట్ డబ్లింగ్ ప్రాజెక్ట్లతో సహా నాలుగు రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. అదేవిధంగా న్యూ జల్పాయిగురి రైల్వేస్టేషన్ పునరాభివృద్ధికి కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఇతర నేతలు పాల్గొన్నారు.
పశ్చిమబెంగాల్ లోని కోల్కతాలో జరిగిన నేషనల్ గంగా కౌన్సిల్ సమావేశానికి కూడా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ముందుగా షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ శుక్రవారం పశ్చిమబెంగాల్ కు వెళ్లి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే ప్రధాని మాతృమూర్తి హీరాబెన్ మరణించడంతో ఆయన గాంధీనగర్ కు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ప్రధాని మోదీ వర్చువల్ గా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, వ్యక్తిగత కారణాలతో బెంగాల్ కు రాలేకపోయాయనని, అందుకు బెంగాల్ ప్రజలు తనను క్షమించాలని కోరారు. వందేమాతరం యొక్క పిలుపు ఎక్కడ నుండి ఉద్భవించిందో, ఈ రోజు వందే భారత్ రైల్ అక్కడ ప్రారంభించబడిందని ప్రధాని అన్నారు. 1943 డిసెంబరు 30న నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్ మరియు నికోబార్ దీవులలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి భారతదేశానికి స్వాతంత్య్రం కోసం పోరాటాన్ని మరింత ముందుకు కదిలించారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక దినానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, నేతాజీ గౌరవార్థం ఒక ద్వీపానికి పేరు పెట్టేందుకు అండమాన్ను సందర్శించే అవకాశం తనకు లభించిందని ప్రధాని తెలియజేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల సందర్భంగా భారతదేశం 475 వందే భారత్ రైళ్లను ప్రారంభించాలని సంకల్పించిందని, ఈ రోజు హౌరా నుండి న్యూ జల్పాయిగురి వరకు ప్రారంభమైన రైలు అందులో ఒకటని ఆయన అన్నారు. ఈరోజు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు జరుగుతున్న పలు ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ, ఈ ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం దాదాపు 5000 కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని ప్రధాని చెప్పారు.
గంగా నది పరిశుభ్రత మరియు తాగునీటికి సంబంధించిన అనేక ప్రాజెక్టులను పశ్చిమబెంగాల్కు అంకితం చేసే అవకాశం కూడా తనకు లభించనుందని ప్రధాని తెలియజేశారు. పశ్చిమబెంగాల్లో నమామి గంగే పథకం కింద 25కు పైగా మురుగునీటి ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని, ఇందులో ఇప్పటికే 11 ప్రాజెక్టులు పూర్తికాగా నేడు ఏడు పూర్తయ్యాయన్నారు. 1500 కోట్లతో 5 కొత్త పథకాల పనులు ఈరోజు ప్రారంభమవుతున్నాయని, 600 కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాలను స్థాపిస్తున్న కీలకమైన ప్రాజెక్టులలో ఆది గంగ ప్రాజెక్టు ఒకటని తెలిపారు. ఇక భారతీయ రైల్వేల సంస్కరణలు మరియు అభివృద్ధిని దేశ అభివృద్ధితో ప్రధాని ముడిపెట్టారు. అందుకే ఆధునిక రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE