ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు కరోనా మహమ్మారి ప్రభావం అధికంగా ఉండి, ఇటివల భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్న 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమీక్ష నిర్వహించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రం ఈ మహమ్మారిపై పోరాడటానికి కలిసికట్టుగా పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈసారి అనేక రాష్ట్రాలతో పాటు టైర్ 2 మరియు టైర్ 3 నగరాలను కూడా కరోనా వైరస్ ఒకేసారి ప్రభావితం చేస్తోందని చెప్పారు. కరోనాపై చేసే పోరాటంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోందని, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ, అవసరమైన సలహాలు ఇస్తున్నట్టు తెలిపారు.
మందులు, ఇంజక్షన్లు, ఆక్సిజన్ బ్లాక్ మార్కెటింగ్ విషయంలో కఠినంగా చర్యలు తీసుకోవాలి:
ఆక్సిజన్ సరఫరాపై పలు రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలపై ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందించారు. ఆక్సిజన్ సరఫరాను పెంచేందుకు నిరంతర కృషి జరుగుతోందని, అన్ని సంబంధిత విభాగాలు మరియు ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఈ విషయంలో కలిసి పనిచేస్తున్నాయన్నారు. పారిశ్రామిక అవసరాలకు వెళ్లే ఆక్సిజన్ ను కూడా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆసుపత్రులకు మళ్లించబడుతుందని పేర్కొన్నారు. ఆక్సిజన్ సరఫరాలో ప్రయాణ సమయం తగ్గించడానికి రైల్వే మరియు వైమానిక దళాన్ని కూడా ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఏ రాష్ట్రానికీ కేటాయించిన ఆక్సిజన్ ట్యాంకర్ ఎక్కడ ఆగిపోకుండా లేదా చిక్కుకుపోకుండా ప్రతి రాష్ట్రం చూసుకోవాలని చెప్పారు. ఇంకా కరోనా చికిత్సలో అవసరమైన మందులు మరియు ఇంజెక్షన్లు, ఆక్సిజన్ విషయంలో ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలని, అలాగే బ్లాక్ మార్కెటింగ్ విషయంలో కఠినంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.
ఇప్పటికి 15 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు కేంద్రం ఉచితంగా అందించింది:
ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని భారత్ నిర్వహిస్తోందని, ఇప్పటివరకు 15 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఉచితంగా అందించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ మరియు 45 ఏళ్లు పైబడినవారందరికీ ఉచిత వ్యాక్సిన్ అందించే కార్యక్రమం యథావిథిగా కొనసాగుతుందన్నారు. అలాగే మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేసేందుకు మిషన్ మోడ్ లో పనిచేయాల్సి ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక కరోనా రోగుల చికిత్స కోసం తీసుకునే అన్ని చర్యలతో పాటుగా, ఆసుపత్రిలో భద్రత కూడా చాలా ముఖ్యమని అంశమని చెప్పారు. ఆసుపత్రి నిర్వాహక సిబ్బందికి భద్రతా ప్రోటోకాల్స్ పై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ రాష్ట్రాలకు సూచించారు. ఈ సమీక్షకు మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, కేరళ, ఛత్తీస్ గర్, మధ్యప్రదేశ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ