రాష్ట్రంలో వరి కోతలను బట్టి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రుల నివాస సముదాయం నుండి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. “ఇప్పటివరకు 3028 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశాం. సంచికి 40 కిలోల 700 గ్రాముల ధాన్యం మాత్రమే తూకం వెయ్యాలి. తూకాల వద్ద పకడ్భంధీగా వ్యవహరించి రైతులకు ఎలాంటి నష్టం రాకుండా చూడాలి. నాణ్యతతో ధాన్యం తెచ్చిన రైతులను అభినందించి ప్రోత్సహించాలి. వ్యవసాయం ఉన్నన్ని రోజులు రైతులకు ఏదో ఒక సమస్య ఉంటుంది. రాష్ట్రంలోని సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి అధ్యక్షులు ప్రతిరోజూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకోవాలి . దీనిమూలంగా రైతుల ఇతర సమస్యలు కూడా మీ దృష్టికి వస్తాయి. అకాల వర్షాల మూలంగా ధాన్యం తడిసిపోకుండా చర్యలు తీసుకోవాలి. రైతులు తమ వద్ద ఉన్న టార్పాలిన్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చుకోవాలి. ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం ఎగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలి” అని మంత్రి పేర్కొన్నారు.
“కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వ నిబంధనలతో కూడిన ఫ్లెక్సీని ప్రదర్శించాలి. ప్రజాప్రతినిధులు నిబంధనలు రైతులకు అర్ధమయ్యేలా వివరించాలి. డీఆర్డీఎ, మహిళా సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పౌరసరఫరాల శాఖ కొనుగోళ్ల విషయంలో సమన్వయంతో వ్యవహరించాలి. వరి కోతలు పూర్తయిన తర్వాత రైతులు పొలాలలో గడ్డిని కాల్చవద్దు. అధికారులు రైతులను ఈ విషయంలో చైతన్యం చేయాలి. వానాకాలం సాగులో పత్తి, కంది సాగు విస్తృతి పెంచాలి. సన్నవడ్ల సాగును పెంచాలి. ఇప్పటి నుండే ఈ దిశగా రైతులను చైతన్యం చేయాలి. ఉపాధిహామీ కింద అన్ని గ్రామాలలో కాల్వల పూడికతీత పనులు వందశాతం పూర్తికావాలి. ఏ కారణం చేత పూడికతీత పనులు చేపట్టకపోయినా సంబంధిత సర్పంచ్, కార్యదర్శులదే బాధ్యత. తూతూమంత్రంగా పనులుచేసినా, పనులు చేపట్టకపోయినా సర్పంచ్, కార్యదర్శులపై చర్యలు తీసుకుంటాం” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ