ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల నిరసన గురించి కీలకంగా మాట్లాడారు. వ్యవసాయ చట్టాలపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్న రైతులను ప్రభుత్వం గౌరవిస్తుందని, కేంద్ర మంత్రులు వారితో నిరంతరం మాట్లాడటానికి అదే కారణమని చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలతో ఏ ఒక్క రైతుకూ కూడా నష్టం వాటిల్లదని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను పార్లమెంటు ఆమోదించిన తరువాత దేశంలో ఏ వ్యవసాయ మార్కెట్ మూసివేయబడలేదు, అదేవిధంగా మద్ధతు ధర అలాగే ఉంది, మద్ధతు ధర అనుగుణంగా పంటల సేకరణ కూడా అలాగే ఉందన్నారు. మరోవైపు మార్కెట్లను బలోపేతం చేయడానికి బడ్జెట్ లో కూడా ప్రతిపాదనలు చేశామన్నారు. ఈ వాస్తవాలను ఎవరూ విస్మరించకూడదని ప్రధాని మోదీ చెప్పారు.
వ్యవసాయ చట్టాలపై కావాలనే దుష్ప్రచారం:
చట్టాలను అడ్డుపెట్టుకుని సభకు అంతరాయం కలిగించే వారు బాగా ప్రణాళికాబద్ధమైన వ్యూహం ప్రకారం అలా చేస్తున్నారని ప్రధాని అన్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారని, ఇలాంటి చర్యల ద్వారా ప్రజల నమ్మకాన్ని వారు ఎప్పటికీ గెలవలేరని చెప్పారు. ఇంతకు ముందు అనేక డిమాండ్ల కారణంగా ఎన్నో ప్రగతిశీల చట్టాలు వచ్చాయని అయితే ప్రజలను అడిగేలా చేయడం వంటి ఆలోచనలు ప్రజాస్వామ్యం కాదని అన్నారు. ముందుగానే బాధ్యత తీసుకొని దేశ అవసరాలకు అనుగుణంగా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉండాలని చెప్పారు. దేశంలో మార్పు కోసం కృషి చేశామని, ఉద్దేశం సరైనదైతే మంచి ఫలితాలు అక్కడే ఉంటాయని అన్నారు. రైతుల జీవన విధానం మెరుగుపరచడంలో భాగంగా పంటను అమ్మేందుకు మరియు పంటలలో వైవిధ్యాన్ని ప్రేరేపించడానికి వారికీ స్వేచ్ఛ ఇవ్వాలి. వ్యవసాయంలో పెట్టుబడులు పెడితే ఎక్కువ ఉపాధి లభిస్తుందని చెప్పారు. రైతులకు నష్టం కలిగించే చట్టాలు ఎలా తెస్తామని, ఈ చట్టాలపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ