ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ (కేబినెట్) విస్తరణపై దృష్టి సారించారు. ఒకట్రెండు రోజుల్లోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేబినెట్ ను విస్తరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. కేంద్ర కేబినెట్ లో 81 మందికి అవకాశముండగా, ప్రస్తుతం 53 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. విస్తరణలో మరో 28 మందికి పదవులు దక్కనున్నాయి. ఒకటికంటే ఎక్కువ శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న వారి నుంచి, కొత్తవారికి కేటాయించడంతో పాటు కేబినెట్ లో మార్పులు కూడా చోటుచేసుకునే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి సమయంలో అన్ని మంత్రిత్వ శాఖల పనితీరుపై ఇప్పటికే విస్తృతంగా సమీక్ష నిర్వహించారు.
ఇప్పటికే రామ్ విలాస్ పాస్వాన్, సురేష్ అంగడి వంటి మంత్రుల మరణంతో ఖాళీలు ఏర్పడగా, అకాలీదళ్, శివసేన పార్టీలకు చెందిన నాయకులు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి రాజీనామా చేయడంతో కేబినెట్ లో ఖాళీలు ఏర్పడ్డాయి. మరోవైపు ఈ కేబినెట్ విస్తరణ కోసం జ్యోతిరాదిత్య సింధియా, శర్వానంద్ సోనోవాల్, సుశీల్ మోదీ, భూపేంద్ర యాదవ్, వరుణ్ గాంధీ, అనుప్రియా పటేల్, రాంశంకర్ కథేరియా, అనిల్ జైన్, రీటా బహుగుణ జోషి, జాఫర్ ఇస్లాం, అజయ్ భట్, అనిల్ బలూనీ, లల్లాన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్, సంతోష్ కుశ్వాహా, జగన్నాథ్ సర్కార్, శంతను ఠాకూర్, నీతీట్ ప్రామాణిక్, ప్రతాప్ సిన్హా, బ్రిజేంద్ర సింగ్, రాహుల్ కస్వాన్, పర్వేశ్ వర్మ, మీనాక్షి లేఖి, నారాయణ్ రాణె, ఉదయన్రాజే భోస్లే, పూనమ్ మహాజన్, ప్రీతమ్ ముండే, పశుపతి పరాస్ వంటి నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. 2019 లో ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా కేబినెట్ విస్తరణ జరగబోతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ