భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా నేడు (మార్చి 28, సోమవారం) రెండో విడత 2022 పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-Iలో భాగంగా మార్చి 21 మొదటి సెట్ అవార్డులు ప్రదానం జరగగా, నేడు సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-IIలో భాగంగా రెండవ సెట్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. 2022 సంవత్సరానికి గానూ పలువురుకి పద్మవిభూషణ్, పద్మభూషణ్ మరియు పద్మశ్రీ అవార్డులను నేడు రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. పద్మవిభూషణ్ గ్రహీతలల్లో డాక్టర్ ప్రభా ఆత్రే మరియు కళ్యాణ్ సింగ్ (మరణానంతరం) ఉండగా, పద్మభూషణ్ గ్రహీతలలో విక్టర్ బెనర్జీ, డాక్టర్ సంజయ రాజారామ్ (మరణానంతరం), డాక్టర్ ప్రతిభారే, ఆచార్య వశిష్ఠ త్రిపాఠి, డాక్టర్ కృష్ణమూర్తి ఎల్లా మరియు సుచిత్ర కృష్ణ ఎల్లా (ద్వయం) ఉన్నారు.
దేశంలో కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ మరియు ఇంజనీరింగ్, వాణిజ్యం మరియు పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవ మొదలైన వివిధ విభాగాలు/కార్యకలాపాల రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా 2022 సంవత్సరానికి గాను నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అవార్డు గ్రహీతలలో 34 మంది మహిళలు ఉండగా, విదేశీయులు/ఎన్ఆర్ఐ/పీఐఓ/ఓసీఐ చెందిన వారు 10 మంది, 13 మరణానంతర అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. కాగా మార్చి 21న జరిగిన సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-Iలో ఇప్పటికే ఇద్దరు పద్మవిభూషణ్, ఎనిమిది పద్మభూషణ్ మరియు 54 మంది పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. నేడు తెలంగాణ నుంచి సకిని రామచంద్రయ్య (కళలు), పద్మజారెడ్డి (కళలు)లకు పద్మశ్రీ పురస్కారం అందుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ