ఆఫ్ఘానిస్తాన్ దేశాన్ని తాలిబన్లు పూర్తిగా వశం చేసుకున్నారు. ఇటీవల అమెరికా బలగాల ఉపసంహరణ అనంతరం తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్ లో పలుప్రాంతాలను వరుసగా స్వాధీనం చేసుకుంటుండగా, ఆదివారం నాడు ఆఫ్ఘాన్ రాజధాని కాబుల్ లోకి కూడా ప్రవేశించారు. తాలిబన్లు కాబుల్ లో విధ్వంసానికి దిగకుండా, బేషరతుగా లొంగిపోవాలని ఆఫ్ఘాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ఆఫ్ఘానిస్తాన్ పూర్తిగా తాలిబన్లు వశం కావడంతో అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ మరికొందరు సన్నిహితులతో కలిసి దేశం విడిచి వెళ్లిపోయారు. అనంతరం తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్ అధ్యక్ష భవనాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వారం రోజుల్లోనే తాలిబన్లు దేశంలో పూర్తి అధికారం దక్కించుకొనే దిశగా అడుగులేశారు. ఆఫ్ఘానిస్తాన్ పేరును మళ్ళీ ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్’ గా మార్చబోతున్నట్టు ప్రకటించారు. తాలిబన్లకు పూర్తిస్థాయి అధికార బదిలీ ప్రక్రియ తర్వాత అధ్యక్షుడి సహా ఇతర యంత్రాంగంపై ప్రకటన చేసే అవకాశముంది.
మరోవైపు తాలిబన్లు దేశాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఆఫ్ఘాన్ లో ప్రజలు, విదేశీయులు బెంబేలెత్తుతున్నారు. దేశం విడిచి వెళ్లేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. తము డబ్బును తీసుకొనేందుకు ఆదివారం నాడు ప్రజలు ఏటీఎం కేంద్రాల వద్ద బారులు తీరారు. అలాగే తమ పౌరులను ఆఫ్ఘాన్ నుంచి వెనక్కి తీసుకొచ్చేందుకు అమెరికాతో పాటుగా పలు దేశాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాలిబన్లు భరోసా ఇచ్చారు. ఇళ్లలోకి చొరబడబోమని, వ్యాపార కార్యకలాపాల్లోనూ కూడా జోక్యం చేసుకోమని ప్రకటించారు. ఇక కాబుల్ లో ఉన్న భారత అధికారులు, సిబ్బందిని దేశానికి తీసుకొచ్చేందుకు భారత్ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ముందుగా ఆఫ్ఘానిస్తాన్ నుండి 129 మంది ప్రయాణికులతో కూడిన ఎయిరిండియా విమానం ఆదివారం సాయంత్రం కాబూల్ నుండి న్యూఢిల్లీకి చేరుకుంది. అలాగే భారతీయులను వెనక్కి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా సోమవారం నాడు కూడా మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ