కేంద్ర ప్రభుత్వం నిధుల సమీకరణ కోసం కేంద్రం భారీ ప్రణాళికను రూపొందించింది. నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపీ) పేరుతో నిధుల సమీకరణ లక్ష్యంగా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను నగదుగా మార్చుకునే భారీ ప్రణాళికను కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నాడు ప్రారంభించారు. ముందుగా 2021-22వ సంవత్సరపు కేంద్ర బడ్జెట్ పరిధిలో ప్రభుత్వ ఖర్చులకోసం ‘ఆస్తులను నగదుగా మార్చుకునే’ ఈ భారీ ప్రణాళికకు నీతీ ఆయోగ్ సంస్థ రూపకల్పన చేసింది. మౌలిక సదుపాయాల రంగంలోని వివిధ మంత్రిత్వ శాఖలను సంప్రదించిన అనంతరం నీతీ ఆయోగ్ ఈ ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రణాళిక ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలకమైన ఆస్తులను నగదుగా మార్చుకోపడం ద్వారా 2022 నుంచి 2025వ సవంత్సరం వరకూ నాలుగేళ్లలో 6లక్షల కోట్ల రూపాయలమేర సమీకరించుకోవచ్చని ఎన్ఎంపీ అంచనా వేస్తోంది.
ఎన్ఎంపీకి చెందిన ఒకటవ, రెండవ భాగాల నివేదికను బుధవారం విడుదల చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, సీఈఓ మరియు మౌలిక సదుపాయాల రంగంలోని వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శుల సమక్షంలో ఈ నివేదికలను విడుదల చేశారు. రోడ్లు, రవాణాశాఖ, జాతీయ రహదారులు, రైల్వేశాఖ, విద్యుత్, పైప్ లైన్, గ్యాస్, పౌర విమానయానం, ఓడరేవులు, జలమార్గాలు, టెలీ కమ్యూనికేషన్లు, అర్బన్ రియల్ ఎస్టేట్, గనుల తవ్వకం, గిడ్డంగులు, గృహనిర్మాణ పట్టణ వ్యవహారాలు వంటి రంగాల్లో ఆస్తులను ప్రైవేట్ కు అప్పగించి, నగదుగా మార్చుకునే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర దార్శనికత ఫలితంగానే ఆస్తులను నగదుగా మార్చే కార్యక్రమం రూపుదిద్దుకుందని చెప్పారు. అత్యున్నత ప్రమాణాలు కలిగిన, అందుబాటు యోగ్యమైన మౌలిక సదుపాయాలు భారత దేశ సామాన్య పౌరుడికి చేరువగా ఉండాలని ప్రధాని ఎల్లపుడూ భావిస్తారని, కొత్త మౌలిక సదుపాయాల కల్పనకు ప్రైవేటు పెట్టుబడులను రాబట్టాలన్న లక్ష్యంతోనే ఆస్తులను నగదుగా మార్చుకునే కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించి, ఉన్నత స్థాయిలో ఆర్థిక ప్రగతిని సాధించడానికి, సంపూర్ణ స్థాయి ప్రజాసంక్షేమం లక్ష్యంగా గ్రామీణ ప్రాంతాలు, సెమి అర్బన్ పట్టణ ప్రాంతాలను పటిష్టమైన రీతిలో ఏకీకృతం చేయడానికి ఈ కార్యక్రమం ఎంతో అవసరం అని ఆమె తెలిపారు. సత్వర మౌలిక సదాపాయాల అభివృద్ధికి, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను, వివిధ కార్యక్రమాలను ఆమె వివరించారు.
మానిటైజేషన్ రైట్స్ అంటే పూర్తిస్థాయి అమ్మకం కాదని, యాజమాన్య హక్కులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానివేనని స్పష్టం చేశారు. ప్రైవేటు సంస్థలకు అప్పగించిన ఆస్తులను నిర్దేశిత గడువు పూర్తయిన తర్వాత మళ్లీ ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వం ఆస్తులను విక్రయిస్తుందనే అనుమానం, ఆందోళన ఎవరికీ అక్కర్లేదని, పైప్ లైన్ ద్వారా ఈ ఆస్తులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విధానపరమైన వ్యవస్థ, నియంత్రణతో కూడిన వ్యవస్థ అండగా నిలిచేలా ఎన్ఎంపీ ప్రణాళిక రూపకల్పన జరిగింది. ఆస్తులను నగదుగా మార్చుకునే ఈ ప్రక్రియ ప్రభావవంతంగా, సమర్థంగా అమలు జరిగేలా చూసేందుకు ఎన్ఎంపీ ద్వారా ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ