దశాబ్దాలుగా కొనసాగుతున్న రాష్ట్రాల సరిహద్దు వివాదంపై సుప్రీం కోర్టు పిలుపునిచ్చే వరకు కర్ణాటక, మహారాష్ట్రల ముఖ్యమంత్రులు తమ వాదనలను బహిరంగంగా వ్యక్తీకరించకూడదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. బుధవారం రాత్రి ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో కీలక సమావేశం నిర్వహించారు. గత కొన్ని వారాలుగా, మహారాష్ట్రకు చెందిన ట్రక్కులపై కర్ణాటకలో దాడులు జరిగాయి. అలాగే దక్షిణాది రాష్ట్రానికి చెందిన బస్సులను శివసేనకు చెందిన ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో అమిత్ షా రెండు రాష్ట్రాల శాంతిభద్రతలపై సమావేశంలో చర్చించారు. ఇక ఈ సమావేశానికి కర్ణాటక నుంచి సీఎం బొమ్మైతో పాటు, రాష్ట్ర హోం మంత్రి జ్ఞానేంద్ర రాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మరియు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు.
అనంతరం అమిత్ షా ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి దావా వేయకూడదని ఒప్పందం కుదిరిందని, చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకునే దిశగా నేతలకు దిశానిర్దేశం చేసినట్లు వెల్లడించారు. దీనికోసం ఒక కమిటీ వేయనున్నామని, దీనిలో రెండు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున మంత్రులు ఉంటారని తెలిపారు. అలాగే శాంతిభద్రతల సమస్యను పరిశీలించడానికి ఒక సీనియర్ పోలీసు అధికారిని నియమించనున్నామని, తద్వారా రెండు రాష్ట్రాల నుండి వచ్చే ప్రయాణికులు లేదా వ్యాపారులు ఎవరైనా ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా ఆయన బృందం భద్రత కల్పిస్తుందని అమిత్ షా తెలియజేశారు.
ఇక సోషల్ మీడియా వేదికగా ఎవరైనా అసంతృప్తిని వ్యక్తం చేసినా, రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టినా, వారిపై పోలీసు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే ఈ సమస్యను రాజకీయం చేయవద్దని, సుప్రీం తీర్పు వచ్చేవరకూ సంయమనం పాటించాలని రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలకు అమిత్ షా విజ్ఞప్తి చేశారు. కాగా 1957లో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైన బెళగావిని కర్ణాటకలో కలపడాన్ని మరాఠీలు తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతరం 1967లో ఏర్పాటైన మహాజన్ కమిషన్ 814 మరాఠా గ్రామాలను కర్ణాటకలో, అలాగే 247 కన్నడ భాషా గ్రామాలను మహారాష్ట్రలో కలిపినట్లు నివేదిక ఇచ్చింది. నాటినుంచి ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తూనే ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ