అక్టోబర్ 14, సోమవారం నాడు నోబెల్ కమిటీ అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రవాస భారతీయుడు, ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీని నోబెల్ పురస్కారం వరించింది. మరో ఇద్దరు ఆర్ధికవేత్తలైన ఎస్తర్ డఫ్లో, మైఖేల్ క్రెమెర్లతో కలిసి అభిజిత్ బెనర్జీ ఈ నోబెల్ అవార్డ్ అందుకోనున్నారు. ఇందులో అభిజిత్ బెనర్జీ, ఎస్తర్ డఫ్లో భార్యాభర్తలు. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు చేసిన వినూత్నమైన పరిశోధనలు, ప్రతిపాదనలకు గానూ వీరికి ఈ పురస్కారాన్ని ప్రకటించారు. అభిజిత్ బెనర్జీ కోల్కతాలో జన్మించారు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్ యూ) నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. అనంతరం విదేశాలకు వెళ్లి హార్వర్డ్ యూనివర్శిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. భారత సంతతికి చెందిన వ్యక్తికీ నోబెల్ పురస్కారం రావడంలో దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అర్థశాస్త్రంలో నోబెల్కు ఎంపికైన ప్రవాస భారతీయుడు అభిజిత్ బెనర్జీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేసారు. పేదరిక నిర్మూలనలో బెనర్జీ గణనీయ కృషి చేశారని చెప్పారు. 2019 ఆర్థిక శాస్త్రానికి ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి బహుమతి సాధించిన భారతీయ-అమెరికన్ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీని, తోటి ఆర్థికవేత్తలను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిఅభినందించారు. ప్రపంచంలోని పేదరికాన్ని నిర్మూళనకు వారు చేసిన కృషిని ముఖ్యమంత్రులు కొనియాడారు. చివరిగా అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటనతో ఈ సంవత్సరం నోబెల్ పురస్కారాలు ముగిశాయి. ఆరు కీలక రంగాల్లో మొత్తం 15 మందిని ఈ సంవత్సరం నోబెల్ పురస్కారాలు వరించాయి.
[subscribe]