రాష్ట్రంలో రైతులే సీఎం కేసీఆర్ కు మొదటి ప్రాధాన్యమని, వ్యవసాయ రంగానికే ప్రభుత్వం అగ్రస్థానం ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమం కోసమే రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలు నిర్మిస్తున్నామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి మార్చేందుకే సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 3 రోజులలోనే కోటీ 33 లక్షల 77వేల ఎకరాలకు సంబంధించి 54.22 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.6,888.43 కోట్ల రైతుబంధు నిధులను జమచేయడం జరిగిందని చెప్పారు. ఈ రోజు వనపర్తి నియోజకవర్గం గోపాల్ పేట, రేవల్లి మండలాలలో మంత్రి నిరంజన్ రెడ్డి రైతువేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. మనిషికో మొక్క నాటి సంరక్షించాలని, మొక్కలు పెంచడం మన సామాజిక బాధ్యతని మంత్రి అన్నారు.
“రాష్ట్రంలో సాగు బాగుపడాలన్న ఉద్దేశంతోనే దేశంలో ఎక్కడా లేనటువంటి పథకాలతో రైతులకు అండగా నిలుస్తున్నాం. దేశానికి అన్నం పెట్టే రైతు అప్పులలో ఉండొద్దన్నది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం. అందుకే కరోనా వంటి విపత్కర పరిస్థితిలోనూ రైతుబంధు నిధులు విడుదల చేసి సీఎం కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యాన్ని చాటి చెప్పారు. దండగన్న వ్యవసాయాన్ని ఆరేళ్లలోనే పండగలా మార్చాము. ఒకప్పుడు కరువునేలగా ఉన్న తెలంగాణను దేశానికి అన్నపూర్ణను చేశాం. గత వానాకాలం, యాసంగిలో కలిపి 1.30 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు తెలంగాణలో పండాయి. ఇది చరిత్రలో రికార్డు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) దేశవ్యాప్తంగా 83.01 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరిస్తే అందులో తెలంగాణ రాష్ట్రం నుండే 52.23 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించింది. గత ఆరేళ్ల తెలంగాణ ప్రభుత్వ చర్యల మూలంగా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని” మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu