తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమయింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సభలో శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. మొత్తం 45 పేజీలతో కూడిన శ్వేతపత్రంలో సంచలన విషయాలను పేర్కొన్నారు. ప్రస్తుతం రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇలాంటి పరిస్థితి రావడాన్ని తాను దురదృష్టంగా భావిస్తున్నానన్న భట్టి.. దశాబ్దకాలంలో జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలని శ్వేతపత్రం విడుదల చేశామని వివరించారు.
ప్రస్తుతం రాష్ట్రం మొత్తం అప్పు రూ. 6,71,757 కోట్లుగా ఉందని శ్వేత పత్రంలో పేర్కొన్నారు. 2014-15 నాటికి రాష్ట్ర అప్పు రూ. 72,658 కోట్లుగా ఉండగా.. 2014-2015 నుంచి 2023-23 మధ్య రాష్ట్ర అప్పు సగటున 24.5 శాతం పెరిగిందని వెల్లడించారు. అలాగే 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర అప్పు రూ. 3,89,673 కోట్లని పేర్కొన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించాక రుణ భారం 10 రెట్లు పెరిగిందని వివరించారు. అలాగే రెవెన్యూ రాబడిలో రుణ చెల్లింపుల భారం 34 శాతానికి పెరిగిందని తెలిపారు.
రెవెన్యూ రాబడిలో 35 శాతం ఉద్యోగుల జీతాలకు వ్యయం అవుతుందని తెలిపారు. ప్రభుత్వం కార్పోరేషన్లలో తీసుకున్న అప్పులు రూ. 59,414 కోట్లు అని వివరించారు. 2015-16లో రుణ, జీఎస్టీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పంగా ఉందని వెల్లడించారు. 57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ. 4.98 లక్షల కోట్లు వ్యయం అయినట్లు తెలిపారు. 2023-24 నాటికి రుణ, జీఎస్టీపీ 27.8 శాతానికి పెరిగిందని తెలిపారు. బడ్జెట్కు, వాస్తవ వ్యయానికి మధ్య 20 శాతం అంతరం ఉన్నట్లు వెల్లడించారు.
ఇక భట్టి విక్రమార్క శ్వేతపత్రాన్ని విడుదల చేసే ముందు.. ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. అలాగే ఎంఐఎం ఫ్లోర్ లీడర్గా అక్బరుద్దీన్, సీపీఐ శాసనసభా పక్ష నేతగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE