కొద్ది రోజులుగా తెలంగాణలో రాజకీయాలలో ఊహించని పరిణామాలు ప్రధాన పార్టీలను కూడా షాక్కు గురయ్యేలా చేస్తున్నాయి. అప్పటి వరకూ తమతో పాటు ఉంటున్న నేతలు.. ఆ తర్వాత రోజే పార్టీ జెండాలు మార్చేస్తూ కనిపించడం కాస్త కంగారును పుట్టిస్తున్నాయి. అసంతృప్తులను కూల్ చేద్దామనుకునేలోపే అవతలి పార్టీ తీర్ధాలు పుచ్చుకుంటూ సొంత పార్టీని టెన్షన్లో పడేస్తున్న నేతల తీరు కొత్త తలనొప్పులు తీసుకువస్తున్నాయి. ఇలా రోజుకో హాట్ హాట్ న్యూసుతో తెలంగాణ పొలిటికల్ వాతావరణం హీటెక్కిపోతోంది. కొన్ని ఇంట్రస్టింగ్ న్యూసులు, మరి కొన్ని చరిత్రలో నిలిచిపోయే వార్తలతో తెలంగాణ రాజకీయాలు కాక రేపుతున్నాయి.
తాజాగా మంథని చరిత్రలో ఓ ఇద్దరు ప్రత్యర్థులు మరో రికార్డును అధిగమించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒకప్పుడు ఒకే గూటి పక్షులుగా ఎదిగిన ఆ ఇద్దరు నాయకులు.. చాలా కాలం నుంచి ఒకరిపై ఒకరు పోటీ పడుతూ అందరినీ ఆకట్టుకుంటూ వస్తున్నారు .తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరోసారి వీరిద్దరే ప్రధాన పార్టీల అభ్యర్థులుగా పోటీపడటం స్థానికంగా ఆసక్తిని రేపుతోంది.
ఇప్పుడు ఈ ఇద్దరు అభ్యర్థుల గురించి చెప్పాలంటే ముందుగా మంథని నియోజకవర్గం గురించి ముందు మాట చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే తెలంగాణలో అత్యున్నత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాల్లో మంథని ఒకటి అని అందరికీ తెలిసిందే. స్వాతంత్య్రోద్యమ చరిత్రలోనే సాయుధ పోరుకు శ్రీకారం చుట్టిన గుల్కొట శ్రీరాములును.. మంథని ఓటర్లే తొలిసారి అసెంబ్లీకి పంపించారు. ఆ తరువాత స్థానికేతరుడు అయినా కూడా స్వాతంత్య్ర పోరాటంతో ఉన్న అనుబంధంతో పీవీ నరసింహరావును.. మంథని ప్రజలు అక్కున చేర్చుకున్నారు. తొలిసారి మంథని రాజకీయాల్లోకి తెరంగ్రేట్రం చేసిన పీవీని.. 1957 నుంచి 1972 వరకూ వరసగా నాలుగు సార్లు గెలిపించి మరీ మంథని ఓటర్లు చరిత్ర సృష్టించారు .
ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి మంథని నియోజకవర్గం నుంచి చంద్రుపట్ల నారాయణ రెడ్డి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా దుద్దిళ్ల శ్రీపాదరావు 1983 నుంచి 1989 వరకు జరిగిన ఎన్నికల్లో గెలిచి హ్యట్రిక్ కొట్టారు. అలాగే 1994లో టీడీపీ తరుఫున బరిలోకి దిగిన చంద్రుపట్ల రాంరెడ్డి విజయం సాధించారు. అలాగే మాజీ స్పీకర్ శ్రీపాదరావు తనయుడు మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 1999 నుంచి 2009 వరకు వరసగా మూడు సార్లు గెలుస్తూ వస్తున్నారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధూకర్ గెలవగా, గత ఎన్నికలు అంటే 2018 ఎన్నికల్లో శ్రీధర్ బాబు విజయం సాధించారు.
అయితే తాజాగా అదే మంథని నియోజకవర్గంలో.. ప్రధాన పార్టీ అభ్యర్థులు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. నాలుగు సార్ల నుంచి కూడా వీరిద్దరే ప్రధాన అభ్యర్థులుగా మంథని బరిలో నిలుస్తూ వచ్చారు. అంటే 2009 నుంచీ కూడా మంథని నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ తరుఫున పుట్ట మధు పోటీ పడుతూ వస్తున్నారు. ఇప్పటి వరకూ నాలుగు సార్లు వీరిద్దరి మధ్య పోటీ నెలకొనడంతో.. సుదీర్ఘ కాలం ఇద్దరి అభ్యర్థుల మధ్యే పోరు నెలకొన్న చరిత్ర మంథనిలో చోటు చేసుకుంది.
2009లో పుట్ట మధు పీఆర్పీ తరుపున పోటీ చేశారు. అలాగే 2014 నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీధర్ బాబుతో తలపడ్డారు. 2014లో శ్రీధర్ బాబును ఓడించిన పుట్ట మధు.. 2018 ఎన్నికల్లో మాత్రం గెలుపును అందుకోలేకపోయారు. తాజాగా మళ్లీ ఈ ఎన్నికల్లోనూ శ్రీధర్ బాబుపై పుట్ట మధు పోటీ చేస్తున్నారు. ఇలా రెండు దశాబ్దాలుగా వీరిద్దరి మధ్యే పోటీ నెలకొనడంతో మంథని చరిత్రలో అరుదైన సంఘటనగా మిగిలిపోయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ