జగనన్న వదిలిన బాణంలా రాజకీయాల్లో గుర్తింపు పొందిన షర్మిల తదనంతరం.. అన్నతోనే విభేదాలు తలెత్తాయి. దీంతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) స్థాపించి తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. తండ్రి బాటలో పయనిస్తూ.. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దాదాపు 3800 కి.మీ.ల పాదయాత్ర ద్వారా తెలంగాణలోని పలు జిల్లాల్లో తిరిగి తనకంటూ ప్రత్యేక ముద్ర సంపాదించుకున్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్పై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూ ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. హౌస్ అరెస్టులు చేసినా, పోలీస్స్టేషన్లకు తరలించినా వెరవలేదు. కూర్చున్న కారును టోయింగ్ చేసినా స్టేషన్కు తరలించినా నిబ్బరం సడలలేదు. ఇంత గుండె దిటవు, మొండి ధైర్యం కలిగిన షర్మిల నిజంగానే ఏమైనా చేయగలదని తెలంగాణలోని చాలామంది ప్రజలు నమ్మారు. ఆమెపై తగిన అభిమానం చూపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పార్టీ తగిన గుర్తింపు పొందగలదని భావించారు.
అనూహ్యంగా కొత్త రకం రాజకీయం
కానీ, ఉన్నట్లుండి షర్మిల కాంగ్రెస్ పార్టీ నేతలతో సంప్రదింపులు జరపడం.. కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధపడటంతో ఆమెపై అభిమానం చూపిన వారు సైతం అనుమానంలో పడ్డారు. రాజకీయాలంటేనే ఎప్పుడూ, ఎవరిని విశ్వసించరాదనే అభిప్రాయానికికొచ్చారు. కాంగ్రెస్పార్టీపై వ్యతిరేకతతతోనే ఆమె సోదరుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆయన జైలుకు వెళ్లిన సందర్భంలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఆగిపోయిన జగన్ పాదయాత్రను తాను అందిపుచ్చుకోవడం తెలిసిందే. జగన్మోహన్రెడ్డి ఏపీలో అధికారంలోకి వచ్చాక అన్నాచెళ్లల్ల మధ్య ఏం జరిగిందోకానీ ఆమె వైఎస్సార్టీపీని స్థాపించి తెలంగాణలో రాజకీయాలు ప్రారంభించారు. సొంత పార్టీతోనే అధికారంలోకి వస్తానని ధీమా వ్యక్తం చేసిన ఆమె.. కాంగ్రెస్ వైపు చూడటంతో ఆమె పార్టీపై ఉన్న విశ్వాసం సన్నగిల్లింది. మరోవైపు ఆమె పార్టీలో ఉన్న ఏపూరి సోమన్న వంటి వారు సైతం పార్టీకి గుడ్బై చెప్పి బీఆర్ఎస్లోకి వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఆ పార్టీలో ఆమె తప్ప చెప్పుకోదగ్గ నేతలంటూ కనిపించడం లేరు.
ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పార్టీ పోటీలో నిలుస్తుందా.. పోటీ చేస్తే ఎన్ని స్థానాల్లో చేస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చెప్పుకోదగ్గ నాయకులు లేకుండా , తగిన ప్రజాబలం లేకుండా ఎన్ని స్థానాల్లో పోటీచేసినా ఒరిగేదేమీ ఉండదు. బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లు పోరాడుతున్న తరుణంలో ఇప్పటి వరకు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధపడి, ఊగిసలాడి, చివరకు పోటీలో నిలిచినా పెద్దగా సాధించేదేమీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించినప్పటికీ, ఆమెను మించిన పార్టీ నిర్ణయమేమిటో ప్రజలు అర్థం చేసుకోలేని వారు కాదు. ఒకటి లేదా రెండు స్థానాల్లో పోటీ చేసి ఒక చోట గెలిచినా కనీసం ఆమె పార్టీ నిలుస్తుంది. పేరు మనుగడలో ఉంటుంది. గెలిస్తే అసెంబ్లీలో ప్రజల పక్షాన తన వాణిని వినిపించే అవకాశం ఉంటుంది. అయితే.. తెలంగాణలో షర్మిలకు ఆ చాన్స్ ఉందా అనేది తెలియాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ