తెలంగాణ రాష్ట్రానికి, అదే విధంగా హైదరాబాద్ నగరానికి ఈ రోజు మరొక ముఖ్యమైన మరియు చారిత్రాత్మకమైన రోజు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని అశోక్ విహార్ (తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాసం) లో జరిగిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కేంద్రం ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొని మాట్లాడుతూ, తన కల 3 నెలలలో సాకారమవుతుందని, ఎప్పుడు అనుకోలేదని అన్నారు. దీనికి కారణమైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరియు చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హిమా కోహ్లీకు కృతజ్ఞతలు చెప్పారు.
జూన్ నెలలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా భాధ్యతలు తీసుకున్నాక తెలంగాణకు వచ్చానని, అప్పడు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం కొరకు ప్రతిపాధనలు పంపించవలసినదిగా కోరానన్నారు. ఎలాంటి సమయము తీసుకోకుండా జూన్ 30, 2021 తేదీలోగా ఆర్బిట్రేషన్ కేంద్రంపై ప్రతిపాధనలు సమర్పించారు. దీనిపై పరిశ్రమల ముఖ్య కార్యదర్శి మరియు ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శిలు జస్టిస్ ఎల్.నాగేశ్వర రావుతో పలుమార్లు చర్చించారు. మొదటగా నేను ఇక్కడ జడ్జిగా ఉన్నప్పుడు నల్సార్ లో జరిగిన కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అప్పటి జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరగా అప్పటి ముఖ్యమంత్రి 10 ఎకరాల భూమి మరియు 25 కోట్లు రూపాయలు కేటాయించారు. కొన్ని అనివార్య పరిస్థితుల వలన అది కార్యరూపం దాల్చలేదని అన్నారు. కాని ఇప్పుడు దానికి బదులుగా ఫైనాన్సియల్ జిల్లా ప్రాంతంలో కొంత భూమిని సొంత భవనం ఏర్పాటు చేసుకోవటానికి కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు.
భారతదేశంలో ఆర్ధిక సంస్కరణలకు పితామహుడైన తెలంగాణ బిడ్డ పి.వి.నర్సింహా రావు నాయకత్వంలో 1995 సంవత్సరంలో ఆర్ధిక సంస్కరణలు ప్రారంభమయ్యాయని అన్నారు. తాను ఇతర దేశాలకు చెందిన పెట్టుబడిదారులను ఇక్కడ పెట్టుమని అడిగితే వారు పెట్టుబడి పెట్టడానికి సిద్దమే కాని ఇక్కడ లిటిగేషన్లు ఎన్ని సంవత్సరాలు పడుతుందోనని బయపడుతున్నామని అన్నారని చెప్పారు. 1996 సంవత్సరంలో ఆర్బిట్రేషన్ చట్టం చేయటం జరిగిందని, దీని ద్వారా ఆర్బిట్రేషన్ ప్రక్రియ వేగవంతమయిందని అన్నారు. ఆర్బిట్రేషన్ కేంద్రం మొదట 1926 సంవత్సరంలో పారిస్ లో ప్రారంభమయిందని, తరువాత నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ మధ్యనే దుబాయ్ లో ప్రారంభమయిందని త్వరలో హైదరాబాద్ లో అమలులోకి వస్తుందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
హైదరాబాద్ లోని పరిస్థితులు ఈ కేంద్రం ఏర్పాటుకు చాలా అనుకూలమని ఇక్కడ వాతావరణం, సంస్కృతి, సాంకేతిక లభ్యత మొదలైనవి ఇందుకు దోహదపడుతాయని అన్నారు. ముఖ్యమంత్రి ఈ కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన మౌళిక సదుపాయాలు మరియు ఆర్ధిక సహకారం అందిస్తామని తెలియజేశారన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మరియు చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు జడ్జి సుప్రీం కోర్టు, జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి, జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్, ఫార్మర్ జడ్జి సుప్రీం కోర్టు, చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హిమా కోహ్లీ, హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ హైకోర్టు, రిజిస్ట్రార్స్ ఆఫ్ హైకోర్టు, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ