తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం వైద్యారోగ్యంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ విద్య, వైద్యారోగ్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఆరోగ్య రంగానికి బడ్జెట్లో రూ.11,440 కోట్లు కేటాయించారని, ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని చెప్పారు. దేశంలో ఆరోగ్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానం చేరేందుకు అందరం కలిసి కృషి చేయాలని కోరారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత వైద్యారోగ్య సేవలు విస్తృతం అయ్యాయి. క్షేత్ర స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. మరింత మెరుగ్గా ఈ సేవలు ప్రజలకు అందించేందుకు మానిటరింగ్ పెంచాలి. 99 శాతం బాగా పని చేసినా ఒక్క నిర్లక్ష్యం చెడ్డ పేరు తెస్తుంది. అలా జరగకుండా చూడాలన్నారు.
కేసీఆర్ కిట్స్ పథకం వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 నుండి 56 శాతానికి పెరిగింది:
“సీఎం కేసీఆర్ ఆలోచనతో దేశంలోనే టి-డయాగ్నొస్టిక్స్ పేరిట అద్భుతమైన రోగ నిర్ధారణ సేవలు అందిస్తున్నాము. 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. దీనిపై దృష్టి పెట్టాలి. ఆరోగ్య శ్రీ సేవలు ప్రజలకు అందేలా చూడాలి. ఎక్కువ కేసులు చేయడం వల్ల పేదలకు ఉచిత వైద్యం అందటంతో పాటు ఆసుపత్రులు బలోపేతం అవుతాయి. 108, 102 అమ్మ ఒడి అంబులెన్స్ సేవలు, అలనా వాహనాలు రివ్యూ చేయాలి. ఆసుపత్రుల్లో జిల్లా కలెక్టర్లు సర్ ప్రైస్ విజిట్ చేయాలి. అక్కడి పరిస్థితులను తెల్సుకోవాలి. పిహెచ్సీ ల్లో వైద్యులు లేరు అనే మాట ఉండొద్దు. ఎక్కడా ఖాళీ లేకుండా భర్తీ చేయాలని సీఎం చెప్పారు. ప్రతి పిహెచ్సీలో డాక్టర్ ఉండాలి. వాక్ ఇంటర్వ్యూలో పెట్టీ అపాయింట్ చేయాలి. 102 వాహనాలను ఎఫెక్టివ్ గా వాడాలి. గర్భిణులకు సేవలు అందించాలి. ఏఎన్ఎం చేకప్స్ చేయించాలి. ముఖ్యంగా సి సెక్షన్లు తగ్గించడంలో ప్రభుత్వం దృష్టి సారించింది. కలెక్టర్లు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ, ప్రైవేటు సెక్షన్ల పై ఆడిట్ చేయాలి. తల్లి పిల్లకు నష్టం అనుకున్నపుడు మాత్రమే సెక్షన్ చేయాలి. ఈ విషయంలో పెద్ద మొత్తంలో అవగాహన కల్పించాలి. అనవసరంగా చేయడం వల్ల తల్లి, బిడ్డకు నష్టం. తల్లి, పిల్ల ఆరోగ్యం బాగుండాలంటే సి సెక్షన్లు తగ్గాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో తగ్గేలా చర్యలు తీసుకోవాలి. ఏఎన్సి చెకప్స్ సక్రమంగా నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మాతా శిశు మరణాలు తగ్గించడం సాధ్యమవుతుంది. కేసీఆర్ కిట్స్ పథకం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 నుండి 56 శాతానికి పెరిగింది. ఇది మరింత పెరిగేలా కృషి చేయాలి. వంద శాతం ఇన్స్టిట్యూషన్ డెలివరీలు జరిగేలా చూడాలి” అని అన్నారు.
వంద శాతం కొవిడ్ వాక్సినేషన్ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి:
“ఎన్సిడి స్క్రీనింగ్ పకడ్బందీగా జరిగేలా చూడాలి. డేటా ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలి. టీబీ ఫ్రీ స్టేట్ అయ్యేందుకు మనం దగ్గర్లో ఉన్నాము. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇటీవల మలేరియా నియంత్రణకు గాను తెలంగాణకు కేంద్రం నుండి అవార్డు వచ్చింది. ఈ విషయంలో కేటగిరీ 2 నుండి 1 కి వచ్చాము. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ, ఆసుపత్రులకు కాయకల్ప, లక్ష్య, క్వాలిటీ అసురెన్స్ సర్టిఫికెట్స్ వచ్చేలా చూడాలి. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, డైట్ సేవలను సమీక్షించాలి. బడ్జెట్ లో చార్జీలను పెంచడం జరిగింది. పాత టెండర్ల గడువు పూర్తి అయిపోయింది. వెంటనే శానిటేషన్, డైట్ టెండర్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. 636 పీహెచ్సీ 232 అర్బన్ పిహెచ్సీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇవి పూర్తి అయితే జిల్లా కలెక్టర్లు సైతం పరిశీలించే వెసులుబాటు ఉంటుంది. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారికి,15-17 ఏళ్ల కేటగిరీ,12- 14 ఏళ్ల కేటగిరీలో వంద శాతం కొవిడ్ వాక్సినేషన్ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి రోజు కోవిడ్ పరీక్షలు చేయాలి. కొత్త మెడికల్ కాలేజీల పనులు, ఆసుపత్రి అప్ గ్రేడేషన్ పనులు వేగవంతం చేయాలి. సీఎం కేసీఆర్ ఈసారి మరో 8 కొత్త మెడికల్ కాలేజీలు పెట్టాలని చెప్పారు. ల్యాండ్ అలాట్మెంట్ ప్రతిపాదనలు త్వరగా పంపాలి. వడ గాలుల విషయంలో ప్రజల్ని అప్రమత్తం చేయాలి. ఆసుపత్రుల్లో తాగునీటి వసతులు ఉండేలా చూడాలి” అని మంత్రి హరీశ్ రావు ఆదేశాలు ఇచ్చారు.
సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వైద్య రంగాన్ని పటిష్టం చేయాలని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అవసరమైన నిధులు అందిస్తున్నారు. నెలలో ఏదో ఒక రోజు కలెక్టర్లు వైద్యారోగ్యంపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించాలి. ఎక్కడికి వెళ్ళినా సమీపంలోని ఆసుపత్రులను సర్ప్రైజ్ విజిట్ చేయాలి. బిఅర్కే భవన్ లో నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్ లో కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ వాకటి కరుణ, ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీఎంఇ రమేష్ రెడ్డి, డిహెచ్ శ్రీనివాస్ రావు, టివివిపి కమిషనర్ అజయ్ కుమార్, టీఎస్ఎంఎస్ఐడిసి చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండి చంద్ర శేఖర్ రెడ్డి, కాళోజీ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ