ఇటీవల భారత-చైనా సరిహద్దుల్లో గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సీఎం కేసీఆర్ బుధవారం నాడు ప్రగతి భవన్ లో సంతోషికి అందించారు. సంతోషికి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే సంతోషికి సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదరుకునే వరకు తోడుగా ఉండాలని సీఎం కేసీఆర్ తన కార్యదర్శి స్మితా సభర్వాల్ ను కోరారు. అనంతరం సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి సీఎం మద్యాహ్న భోజనం చేశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.
మరోవైపు గతంలో ప్రకటించిన విధంగా హైదరాబాద్ లో నివాస స్థలాన్ని కూడా ఈరోజు ఆమెకి అప్పగించారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14 లో కేబీఆర్ పార్క్కు ఎదురుగా ఉన్న 711 గజాల స్థలాన్ని సంతోష్ బాబు కుటుంబానికి కేటాయించారు. ముందుగా ఆ స్థలాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పరిశీలించి, స్థలానికి సంబంధించిన పత్రాలను కలెక్టర్ సంతోషికి అందజేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu