రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, రిజర్వాయర్లు, నదులు పొంగిపొర్లుతున్న పరిస్థితుల్లో తక్షణ రక్షణ చర్యలను కొనసాగిస్తూ, వరదలవల్ల కలిగే ఆస్తి, ప్రాణ నష్టాలను వీలయినంతమేర తగ్గించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజా ప్రతినిధులను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు సమీక్షలు నిర్వహించి అప్రమత్తం చేసిన సీఎం కేసీఆర్ బుధవారం కూడా ప్రగతి భవన్ లో వానలు వరదలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఎగువన కురుస్తున్న భారీ వానల నేపథ్యంలో అటు కృష్ణా ఇటు గోదావరి నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి నది హెచ్చరికలుదాటి ప్రవహిస్తున్న నేపథ్యంలో నదిమీది ఎస్సారెస్పీ వంటి పలు రిజర్వాయర్లకు సంబంధించిన ఇన్ ఫ్లో అవుట్ ఫ్లోల గురించి ఆరాతీస్తూ ఇరిగేషన్ శాఖ అధికారులకు సీఎం తగు ఆదేశాలు జారీచేశారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చేపట్టిన చర్యలను సీఎం ఎప్పటికప్పుడు ఆరా తీశారు. మహారాష్ట్ర ఎగువ గోదావరి నుంచి వరదను అంచనా వేసి చేపట్టవలసిన చర్యలకు ఫోన్లో అదేశాలిచ్చారు. వరదల వల్ల రవాణా, విద్యుత్తు తదితర సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖలు చేపడుతున్న రక్షణ చర్యలపై కూడా సీఎం కేసీఆర్ ఆరా తీశారు.
గోదావరి నది మీది కడెం ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు దిగువకు నీటిని విడుదల చేస్తున్నా, ఇంకా వరద పెరుగుతున్నదని అధికారులు సీఎంకు వివరించారు. ఈమేరకు ముంపు కడెం ప్రాజెక్టు కింద 12 గ్రామాలు ఖాళీ చేయించారు. అక్కడే వుండి రక్షణ చర్యల్లో పాలుపంచుకుంటున్న స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్లో సీఎం తగు ఆదేశాలు జారీ చేశారు. నిర్మల్ మరియు ఇతర వరద ముంపుకు గురౌతున్న పట్టణాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ను సీఎం ఆదేశించారు. వరదలకు తెగిపోతున్న జాతీయ, రాష్ట్ర రహదారుల పునరుద్దరణకు సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని సీఎం ఆదేశించారు. ఎక్కడ కూడా ప్రాణహాని జరగకుండా తీసుకోవాల్సిన సత్వర చర్యలన్నింటి గురించి సీఎస్, ఇరిగేషన్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం ఆదేశాలిచ్చారు.
భద్రాచలంలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను అక్కడే వుండి ఏర్పాట్లు పర్యవేక్షించాలని, ముంపు ప్రాంతాల ప్రజలను తక్షణమే ఖాళీ చేయించాలని సీఎం ఆదేశించారు. వరదల నేపథ్యంలో రాష్ట్రంలో పంటల పరిస్థితిని, చెరువులకు గండ్లు పడుతున్న పరిస్థితి గురించి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరజన్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో సీఎం సమీక్షించారు. వరదలు తగ్గగానే వెంటనే కావాల్సిన విత్తనాలు ఎరువులను అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాల వల్ల విద్యుత్తు సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని, విద్యుత్ ఉత్పాదనకు మరో నెల రోజులకు సరిపడా బొగ్గును నిల్వచేసుకోవాలని విద్యుత్ శాఖ సీఎండీలు ప్రభాకర్ రావు, రఘుమారెడ్డి, సింగరేణి సీఎండీ శ్రీధర్ లను సీఎం ఆదేశించారు. ఇప్పటివరకు 2300 వరకు విద్యుత్తు స్థంభాలు కూలిపోతే 1600 వరకు పునరుద్దరణ చేపట్టామని, మిగతా పునరుద్దరణ పనులు పురోగతిలో ఉన్నాయని విద్యుత్ శాఖ అధికారులు వివరించారు. విద్యుత్తుకు అంతరాయాలు ఏర్పడ్డ చోట తక్షణమే ప్రత్యామ్నాయ సౌకర్యాలద్వారా విద్యుత్తును పునురుద్దరిస్తున్నట్టు సీఎండీ రఘురామారెడ్డి సీఎంకు వివరించారు.
ప్రాజెక్టులకు చేరుకుంటున్న వరదను పట్టి అవకాశమున్న చోట హైడల్ ప్రాజెక్టులను ప్రారంభించాలని సీఎం అన్నారు. దేవాదుల ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్న నేపథ్యంలో వరదనీరు చేరుకోవడంతో తక్షణ చర్యలు చేపట్టి, వరద నీటిని ఎత్తిపోసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఈఎన్సీ మురళీధర్ రావును సీఎం ఆదేశించారు. వానలు వరదల నేపథ్యంలో చేపట్టిన రక్షణ చర్యలకు కావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు విడుదలచేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా తలెత్తుతున్న సమస్యలపై ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను సీఎం ఆదేశించారు. వానలు వరదల నేపథ్యంలో అత్యవసరమైతే తప్పితే ప్రజలెవరూ కూడా బయటకు వెల్లవద్దని సీఎం విజ్జప్తి చేశారు. సమీక్షా సమావేశం నుంచే వరద ముంపు అధికంగా వున్న జిల్లాల్లోని మంత్రులు, కలెక్టర్లు, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులను ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకుని ఆదేశాలు జారీచేశారు. ఎట్టిపరిస్థితుల్లో పరిస్థితులు చక్కబడేవరకు వారి వారి నియోజకవర్గాలు జిల్లాలు విడిచి వెల్లరాదని మరోమారు సంబంధిత జిల్లాల మంత్రులను ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు.
అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు:
భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు ఇప్పటికే ప్రకటించిన సెలవులను 16 తేదీ వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులను ఉత్తర్వులు జారీ చేయాలని సమీక్ష సమావేశం నుంచే సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు సత్యవతి రాథోడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కాలేరు వెంకటేష్, హర్షవర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంఓ ఉన్నతాధికారులు, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, విద్యుత్తు, ఆర్ అండ్ బి, జిహెచ్ఎంసి, మున్సిపల్, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY