తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రాజకీయాల్లో అపర చాణుక్యుడు అనడం అతిశయోక్తి కాదు. ఆయన శక్తియుక్తులు ఇప్పటికే చాలాసార్లు నిరూపితమయ్యాయి. అనారోగ్యం కారణంగా కొద్ది రోజులుగా ఆయన స్తబ్దుగా ఉన్నారు. పార్టీని, అభ్యర్థులను నడిపించే బాధ్యత మంత్రి కేటీఆర్కు, మేనల్లుడు హరీశ్రావుకు అప్పగించారు. తమదైన శైలిలో వారు దూసుకెళ్తున్నా.. ఎక్కడో కొంత లోటు కనిపించింది. అదే కేసీఆర్ శైలి రాజకీయం. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల క్రితమే కేటీఆర్ మాట్లాడుతూ.. త్వరలోనే పులి బయటకు వస్తోందని చెప్పారు. అన్నట్లుగా పులి రంగంలోకి దిగింది. ఆయన అన్నట్లుగానే.. రాజకీయాల్లో పులి లాంటి కేసీఆర్ బయటకు వచ్చారు.. బీ ఫారాలు పంపిణీ సమయంలోనే పని మొదలెట్టినట్లుగా సంకేతాలు ఇచ్చారు. రెండు రోజుల్లోనే బీఆర్ ఎస్ గ్రాఫ్ పెరుగుతోందన్న ఫీల్ పార్టీ శ్రేణుల్లో తెచ్చారు.
బీ ఫారాలు పంపిణీ చేసిన కేసీఆర్ ఆ సమయంలోనే అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు. భయపడకండి.. విజయం మనదే అని ఉత్సాహపరిచారు. అంతేకాకుండా.. జనంలో గెలవలేక.. కోర్టుల్లో కేసులు వేస్తారు.. సాంకేతికంగా కారణాలు చూపి, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు.. తస్మాత్ జాగ్రత్త అంటూ నామినేషన్ వేసే సమయంలో తీసుకునే జాగ్రత్తలను తెలియజేశారు. బయటకు వచ్చింతే తడవుగా.. వరసగా ఎన్నికల సభలకు శ్రీకారం చుట్టారు. తనదైన శైలిలో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ‘ఎలక్షన్లు రాంగనే వస్తరు.. ఆపదల మొక్కులు మొక్కుతారు ’ అంటూ ప్రతిపక్షాలపై సెటైరికల్ కామెంట్లతో వ్యంగ్యాస్త్రాలు మొదలుపెట్టారు.
‘మీ అందరినీ ఒకేది ఒకటే. ఎలక్షన్లు రాంగనే ఎవరో వస్తరు.. ఏదో చెబుతరు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతరు. అలవిగాని సామెతలు చెబుతరు. ఆపదల మొక్కులు కూడా మొక్కుతరు.. తీర్థం పోదంపా తిమ్మక్క అంటే.. నువ్వు గుల్లె.. నేను సల్లే.. యాడికి తోలుకపోతరో తెల్వదు. ఇవాళ కొన్ని పార్టీలు మాట్లాడుతున్నయ్. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అంటున్నయ్. మీకు పది ఛాన్స్లు ఇచ్చారు కదా.. 60 ఏళ్లు రాజ్యం మీరే వెలుగబెట్టారు కదా? ఇక్కడి నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా. దళిత బిడ్డలు ఆలోచన చేయాలి. మనందరికీ సిగ్గుచేటు’ అంటూ తెలంగాణ యాస.. భాషలో ఆకట్టుకున్నారు.
ఇలాంటివి కేసీఆర్ కే చెల్లు..
సభల్లో చెప్పడమే కాదు.. చెప్పింది మౌత్ పబ్లిసిటీ అయ్యేలా, ప్రజల్లో గుర్తుండిపోయేలా చేయడం కేసీఆర్ కే చెల్లుతుంది. తాను చెప్పే విషయాలను విని వదిలేయకుండా ఇంట్లో, బస్తీలో, గ్రామంలో, తండాల్లో చర్చించాలని ప్రజలను కోరడం ద్వారా దటీజ్ కేసీఆర్ అనిపించుకుంటున్నారు. ‘ఎన్నికలు చాలా వస్తయి, చాలా పోతయి, ఎవరో ఒకరు గెలుస్తుంటరు. ఎన్నికలు రాంగనే ఆగమాగం కావొద్దు. రౌతేందో.. రత్నమేందో ఆలోచించాలె. మనకు పనికొచ్చేదేందో గుర్తు వట్టాలె’ అని అన్నారు. ఎవరో చెప్పారని ఓట్లు వేయొద్దని, ఓటు మన తలరాతను మారుస్తుందని చెప్పారు. మన గ్రామం, మన మండలం, మన జిల్లా, మన రాష్ట్ర తలరాతను మార్చే శక్తి ఓటుకు ఉన్నదని అన్నారు.
రాజకీయ చతురత అంటే ఇదే..
ఇక నిన్న జనగామలో జరిగిన బహిరంగ సభలో కూడా కేసీఆర్ రాజకీయ చతురతను ప్రదర్శించారు. అక్కడ తనకు టికెట్ కేటాయించకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చేసిన రాద్దాంతం అంతా ఇంతా కాదు.. పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత ఆయనకు ఆర్టీసీ చైర్మన్ కట్టబెట్టి అసమ్మతి సద్దుమణిగేలా చేశారు. అయితే అంతటితో ఆగకుండా జనగామలో జరిగిన సభలో అభ్యర్థితో పాటు.. ముత్తిరెడ్డిని కీర్తిస్తూ.. అతడి సహకారంతో.. పల్లా గెలవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రకటించి.. ముత్తిరెడ్డి ని ఉత్సాహపరిచారు. అంతేకాదు.. జనగామ సభ వేదికగా బీఆర్ ఎస్ లో చేరిన పొన్నాల లక్ష్మయ్య ను కూడా వేదికపై పలు మార్లు కీర్తించారు. ‘ఎలక్షన్లు చాలా సందర్భాల్లో వస్తాయి. ఎన్నికలు రాంగనే ఆగం కావొద్దు. పరేషన్ కావొద్దు. ఎవరో చెప్పారని ఓటు వేయవద్దు. మా బావమరిది చెప్పిండు. మా మ్యాన మామ చెప్పిండు.. మా అన్నగాడు చెప్పిండని ఓటు వేయొద్దు. మంచి, చెడు గుర్తించి.. మంచి వైపు వెళితే బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంటుంది’ అంటూ విపక్షాలను ఉద్దేశించి చురకలు వేస్తూనే.. పార్టీ నేతలను, ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగించారు. బయటకు వచ్చిన రెండు రోజులకే.. రాజకీయ దుమారం రేపి.. దటీజ్ కేసీఆర్ అనిపించుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE