తెలంగాణ సీఎం కేసీఆర్ నిజమైన అంబేడ్కర్ వాది అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని సవరిస్తే అంబేడ్కర్ను అవమానించినట్లవుతుందా అని ఐటీ, పురపాలక శాఖ కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇప్పటికి 105 సార్లు రాజ్యాంగాన్ని సవరించాయని.. అంతమాత్రాన అంబేడ్కర్ను అవమానించినట్లా అని ఆయన విపక్షాలను నిలదీశారు. గతంలో ఎన్డీఏ హయాంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2001లో రాజ్యాంగాన్ని సవరించడానికి ఒక కమిటీని వేశారని, అప్పుడు వాజ్పేయి.. రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లా? అని కేటీఆర్ అడిగారు. అలాగే, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కొత్త రాజ్యాంగం కావాలని అన్నారని.. అప్పుడు ఆయన కూడా అంబేడ్కర్ ను అవమానించినట్లేనా? అని కేటీఆర్ నిలదీశారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు, తెలంగాణకు, దళితులకు, రైతులకు జరిగిన అన్యాయాల గురించి లేవనెత్తితే.. సమాధానం చెప్పలేకనే విపక్ష నేతలు చిల్లర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్థాపించిన ఎంజేఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో.. కార్పొరేట్ స్థాయిలో నిర్మించిన మోడల్ స్కూల్ను శుక్రవారం మంత్రులు సబితాఇంద్రారెడ్డి, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. అలాగే, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడ్గల్ గ్రామంలో రూ. 2.10 కోట్లతో నిర్మించిన 40 డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో కేటీఆర్ మాట్లాడారు. బోధించు.. సమీకరించు.. పోరాడు.. అనే అంబేడ్కర్ నినాదాలతోనే 14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ నిజమైన అంబేడ్కర్వాది అని అన్నారు. గతంలో.. ఒకవేళ రాజ్యాంగాన్ని పాలకులు దుర్వినియోగం చేస్తే.. దానిని తగులబెట్టడంలో తానే ముందుంటానని రాజ్యాంగం రచించిన మూడేళ్ల తర్వాత అంబేడ్కరే అన్నారని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ