తెలంగాణలో రాష్ట్రంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ముందుగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకొని, అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళర్పించారు. అనంతరం గోల్కొండ కోటకు చేరుకొని సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. “ఇది భారత స్వాతంత్య్ర అమృత ఉత్సవాలు జరుగుతున్న సందర్భం. జాతి చరిత్రలో ఒక విశిష్ట ఘట్టం. ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్ర సాధన కోసం జరిగిన పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, స్వాతంత్య్ర సమరవీరుల మహోన్నత త్యాగాలను యావత్ భారత జాతి సగర్వంగా స్మరించుకుంటున్నది. దేశ విముక్తి కోసం తృణ ప్రాయంగా తమ ప్రాణాలను త్యాగం చేసిన మహానీయులందరికీ వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నాను” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో, అహింసా మార్గంలో సాగిన జాతీయోద్యమమే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి మనం విజయం సాధించాం. స్వరాష్ట్రం సాధించుకున్న నాటినుంచి ప్రజా సమస్యల పరిష్కారమే కేంద్రంగా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా, ప్రణాళికాబద్ధంగా తెలంగాణా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. అన్నిరంగాల అభివృద్ధి, అన్నివర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తున్నదన్నారు.
“రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించే మార్గంలో ఎన్నో అవరోధాలు, సమస్యలు, సవాళ్ళు, మరెన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రాష్ట్ర ప్రజల ఆశీర్వాద బలంతో వాటన్నిటినీ అధిగమించి పురోగమించ గలుగుతున్నది. ప్రతీ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న పరిస్థితులకు, నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యం. అన్నిరంగాలలో గుణాత్మకమైన, గణనీయమైన అభివృద్ధిని ఆవిష్కరించగలిగాం. వాస్తవం కళ్ళముందే కనపడుతోంది. ప్రగతి ఫలాలు ప్రజల అనుభవం లో ఉన్నాయి. విద్యుత్ సమస్య, తాగునీటి సమస్య, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవడమే కాదు, ఈ రంగాలలో నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. దీర్ఘ దృష్టి తో రూపొందిన ప్రణాళికతో, పటిష్టమైన ఆర్ధిక క్రమశిక్షణ తో పరిపాలన కొనసాగించటం వల్ల తెలంగాణా ఏడు సంవత్సరాల స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఆర్థికాభివృద్ధితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది. 2013 -2014 తెలంగాణా ఏర్పడిన నాడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి 4,51,580 కోట్ల రూపాయలు. కోవిడ్ ఉత్పాతం ఆర్ధిక వ్యవస్థ ఎదుగుదలకు తీవ్ర అవరోధాలను సృష్టించినప్పటికీ 2020-2021 ఆర్ధిక సంవత్సరం లో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి 9 లక్షల 80 వేల 407 కోట్ల రూపాయలుగా నమోదైంది. అదే విధంగా రాష్ట్రం ఏర్పడిన నాడు 2013-2014 ఆర్ధిక సంవత్సరంలో మన రాష్ట్ర తలసరి ఆదాయం 1 లక్షా 12 వేల 126 రూపాయలు ఉండగా నేడు తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 2 లక్షల 37 వేల 632 రూపాయలకు చేరుకుంది. నేడు మన దేశ తలసరి ఆదాయం 1 లక్షా 28 వేల 829 రూపాయలు గా నమోదైంది. దేశ తలసరి ఆదాయం కంటే, తెలంగాణా రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో పదికి మించి పార్లమెంట్ స్థానాలున్నపెద్ద రాష్ట్రాలతో పోలిస్తే, తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పడానికి గర్విస్తున్నాను” సీఎం కేసీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ