తెలంగాణపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. త్వరలోనే హైదరాబాద్కు కాంగ్రెస్ నాయకత్వం తరలి రానుంది. కర్ణాటక తరువాత తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనుంది. సోనియా గాంధీ సెప్టెంబర్ 17న తెలంగాణ ఎన్నికల సమర శంఖం పూరించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు
తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా.. సెప్టెంబరు 16, 17 తేదీల్లో హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరపాలని నిర్ణయించారు. సీడబ్ల్యూసీ కార్యవర్గ పునర్ వ్యవస్థీకరణ అనంతరం జరుగుతున్న తొలి సమావేశం ఇదే. ఈ సమావేశం హైదరాబాద్లో జరపాలని తెలంగాణ పీసీసీ ప్రతిపాదించి, ఇటీవల అధిష్టానానికి లేఖ కూడా రాసింది. సోనియా గాంధీ, రాహుల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, ప్రియాంకా గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, అశోక్ గెహ్లాట్, భూపేష్ భాగేల్, సుఖ్విందర్ సింగ్ సుఖు సహా 39 మంది వర్కింగ్ కమిటీ సభ్యులు ఈ సమావేశం కోసం రాష్ట్రానికి రానున్నారు.
సెప్టెంబరు 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు కావడంతో ఆ వేడుకల్లో సోనియాగాంధీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ చేసిన త్యాగాలేమిటో సోనియా ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణ ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించిన సోనియానే హైదరాబాద్ వేదికగా జరిగే కార్యక్రమంలో పాల్గొని..ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు.
ఈ నెల 18వ తేదీ నుంచి కేంద్రం అనూహ్యంగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయించింది. వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్య నేతలు అదే రోజు తెలంగాణవ్యాప్తంగా పర్యటించి, ఎన్నికల ప్రచారాన్ని ఏకకాలంలో ప్రారంభించేలా పార్టీ కసరత్తు చేస్తోంది. 17న సోనియా ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగంలో పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే అంశాలను వివరించనున్నట్లు చెబుతున్నారు. పార్టీ మేనిఫెస్టోను ప్రకటించేలా ప్రణాళికలు సిద్ధవుతున్నాయి.
ఇక, వచ్చే నెల నుంచి పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అక్టోబరు 2 నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క, శాసన మండలి పక్షనేత టి.జీవన్రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్సరెడ్డితోపాటు కీలక నేతలంతా నెల పాటు బస్సుయాత్ర చేపట్టనున్నారు. ఈ నెలలోనే అభ్యర్థుల జాబితా ఫైనల్ చేసి ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సెప్టెంబర్ 3న ఆదివారం గాంధీభవన్లో సమావేశం కానుంది. ఆయా అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థుల నుంచి అందిన దరఖాస్తులను ఈ సమావేశంలో పరిశీలించనున్నారు. నిబంధనల మేరకు అభ్యర్థులు పొందుపరిచిన వివరాలను కమిటీ సరిచూసి నివేదికను రూపొందిస్తుంది. సెప్టెంబర్ 4న ఉదయం 10 గంటలకు టీపీసీసీ స్ర్కీనింగ్ కమిటీ సమావేశం కానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE