రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. అందుకే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందరి చూపూ అటే ఉంటుంది. ఏ నేత గెలుస్తారు. వారి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అంటూ చర్చలు షురూ చేస్తారు. అలా ఇప్పుడు సీతక్క గురించి నయా చర్చ పొలిటికల్ సర్కిల్లో వాడివేడిగా జరుగుతోంది. ఒకప్పుడు నక్సలైట్గా ఖాకీలతో ఫైట్ చేసిన సీతక్కకు పంచాయతీ రాజ్, మహిళ, శిశు సంక్షేమ శాఖలను కేటాయించడంతో.. మరోసారి ఆమె గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన సీతక్క.. ఇప్పుడు పంచాయతీ రాజ్, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి హోదాలో తెలంగాణలో తిరగబోతున్నారన్నారు. దీంతో ఇది ఓ ధీర మహిళ విక్టరీ అని కొందరంటే.. ఇది సీతక్క విజయం అని ఇంకొంతమంది అంటున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వచ్చాక.. రెండు రోజుల పాటు రాజకీయంగా ఉత్కంఠ రేపినా కూడా.. చివరకు సీఎంగా రేవంత్ రెడ్డి వైపే కాంగ్రెస్ అధినాయకత్వం మొగ్గు చూపింది. తర్వాత డిసెంబర్ 7న జరిగే ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమంలో..ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేశారు. అలాగే 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే మంత్రులుగా ప్రమాణం చేసినప్పటికీ.. వారికి కేటాయించబోయే శాఖలపై నిన్నటివరకూ ఉత్కంఠ నెలకొంది.
డిసెంబర్ 8న ఢిల్లీకి వెళ్లిని సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ హైకమాండ్తో సుదీర్ఘ చర్చలు జరిపి మంత్రులకు శాఖలను ఖరారు చేశారు. ఈ మేరకు మంత్రులకు కేటాయించిన శాఖలను రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. దీనిలో భాగంగా పంచాయతీ రాజ్, మహిళ, శిశు సంక్షేమ శాఖను సీతక్కకు కేటాయించారు. దీంతో సీతక్క వర్గీయలంతా సంతోషంతో సంబరాలు జరుపుకొంటున్నారు. ఇక అడవి బిడ్డలకు మంచి రోజులొచ్చినట్లేనని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే సీతక్కకు హోం మంత్రి పదవిని ఇస్తే తమ బతుకులు ఇంతా బాగుపడేవని చెప్పుకుంటున్నారు. నిజానికి ఒక మాజీ నక్సలైట్ జనజీవన స్రవంతిలో కలిసాక వారికి ఎదురయే ఇబ్బందులకు బయపడే చాలామంది దానికి సాహసించరు. కానీ సీతక్క ఏకంగా రాజకీయాల్లోకి కూడా వచ్చి రెండు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారు. ఇప్పుడు ఏకంగా మంత్రిగా మరోసారి అందరికీ చేరువ కానున్నారు.
మన సమాజంలో నక్సలైట్ అన్నా, మాజీ నక్సలైట్ అన్నా వారికి దూరంగా ఉంటారు. చివరకు వారితో మాట్లాడటానికి కూడా వెనుకడుగు వేస్తారు. కానీ అలాంటి వారంతా ఇప్పుడు సీతక్కను చూసి తమ అభిప్రాయాన్ని మార్చుకునే విధంగా సీతక్క తన ప్రస్థానాన్ని సాగించారు. కరోనా మహమ్మారి వణికిస్తున్న సమయంలో ఆమె అందరిలో మాస్కులు వేసుకుని ఇంట్లో కూర్చోలేదు. ఆకలితో అలమటించిన వారందరికీ కడుపు నింపింది. అలాగే ఇటీవల వరదల ధాటికి ఊళ్లు ఏకమయినపుడు కూడా మోకాళ్ల లోతులో దిగి మరీ సీతక్క వారికి అండగా నిలిచింది. అందుకే తమకే కష్టం వచ్చినా, కన్నీళ్లు వచ్చినా నేనున్నానంటూ అందరి కంటే ముందే సీతక్క ఉంటుందని ఆ ప్రాంతవాసులు గొప్పగా చెప్పుకుంటారు.
అందుకే ధనసరి అనసూయగా కంటే సీతక్కగానే ఆమెను అంతా అక్కున చేర్చుకుంటారు. ఆ ప్రేమతోనే ఇప్పుడు ఆమెకు హ్యాట్రిక్ విజయాన్ని అందించి మరోసారి గుండెల్లో పెట్టుకున్నారు. సీతక్క గెలిచిందంటే తామంతా గెలిచినట్లేనని బడుగు బలహీన వర్గాలకు చెందినవారంతా ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారు. అటు తమపై జరిగే అన్యాయాలను, అక్రమాలను సీతక్క అణిచివేస్తుందని..ఇక జీవితాల్లో వెలుగులు వచ్చినట్లేనని అడవి బిడ్డలు భావిస్తున్నారు.అప్పుడు ఎమ్మెల్యేగా..ఇప్పుడు మంత్రిగా సీతక్క ప్రయాణం మొదలు పెట్టబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ