ఇప్పుడున్న పరిస్థితుల్లో డాక్టర్ల వైద్యం కంటే కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వైద్యాలే ఎక్కువ ఫేమస్ అవుతున్నాయి. ఎవరికి తోచినట్లు వాళ్లు వీడియోలు తీసుకోవడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రకరకాల చిట్కాలు, వైద్యాలు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఏది నిజంగా పని చేస్తుందో ఏది వాళ్ల వ్యూస్ కోసం చేశారో తెలియక చాలామంది అయోమయానికి గురవుతున్నారు. తాజాగా మరోసారి గో మూత్రం ఎన్నో రోగాలను నయం చేస్తుందన్న వార్తలు తెరమీదకు వచ్చాయి.
నిజానికి ఎప్పటి నుంచో గోమూత్రం ఆరోగ్యానికి ప్రయోజనకరమని వింటూనే ఉన్నాం. కానీ శరీరం తనలోని విష పదార్ధాలను వడపోసి యూరిన్గా విడుదల చేస్తే అది తాగడం ఏంటన్న వాదన కూడా వినిపించేసరికి చాలామంది గోమూత్రంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే గోమూత్రంతో క్యాన్సర్ చికిత్స సాధ్యమవుతుందని తాజాగా కొంతమంది చెబుతున్నారు. అయితే నిజంగానే ఆవు మూత్రం రోగాలను నయం చేస్తుందా? ఈ విషయంపై ఆయుర్వేదం ఏం చెబుతోంది? సైన్స్ దీనిని ఒప్పుకుంటుందా అని చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఆయుర్వేదం చెబుతున్న దాని ప్రకారం గోమూత్రంతో ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చని ఉంది. ఆవు మూత్రంలో ఉండే బరువు తగ్గడానికి ఉపయోగపడే విటమిన్లు ఉంటాయని చెబుతోంది. దీంతో పాటు జీర్ణవ్యవస్థను మెరుగు పరచడానికి, చర్మ సంరక్షణకు కూడా ఉపయోగించవచ్చని తెలిపింది. మొటిమలు, ఇతర చర్మ సంబంధిత సమస్యలలో గోమూత్రాన్ని ఉపయోగించవచ్చని .. అలాగే రింగ్వార్మ్, గజ్జి వంటి చర్మ వ్యాధులను కూడా నయం చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఏకంగా ఇపుడు కేన్సర్ రోగులు గోమూత్రాన్ని తాగితే మంచిదని.. దీనివల్ల ఆ కేన్సర్ నుంచి బయటపడొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే దీనిపై మెడికల్ అండ్ పీడియాట్రిక్ ఆంకాలజీ నివేదిక చెబుతున్నదాని ప్రకారం.. గోమూత్రం ప్రయోజనకరమనేనని కాకపోతే అవి పంటలకు మాత్రమేనని తేలింది. గోవు మూత్రంతో క్యాన్సర్ను నయం చేయడమనేది సాధ్యం కాదని తేల్చింది. కేవలం గోమూత్రం తాగి క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధి నుంచి బయటపడిన రోగిని..ఇప్పటి వరకూ తాము గుర్తించలేదని చెప్పుకొచ్చింది. నిజానికి గో మూత్రంలో క్యాన్సర్ను నిర్మూలించే ఎలాంటి మూలకం లేదని స్పష్టం చేసింది. ఆవు మూత్రంలో 95% నీటితో పాటు పొటాషియం, సోడియం, ఫాస్పరస్, క్రియాటినిన్ ఖనిజాలు ఉంటాయి. కానీ క్యాన్సర్ను నిరోధించే కారకాలు ఇవేమీ కావని తేల్చి చెప్పింది. సాధారణంగా పంటలను మరింత సారవంతం చేయడానికి మాత్రమే పొలాల్లో గోమూత్రాన్ని ఉపయోగిస్తుంటారు. అందుకే గోమూత్రం పంటలకు మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప క్యాన్సర్కు ఔషధంగా మాత్రం పనికి రాదని స్పష్టం చేసింది.
మరోవైపు బరేలీకి చెందిన ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా దీనిపై పరిశోధనలు జరిపింది. తమ పరిశోధనల ప్రకారం గో మూత్రంలో హానికరమైన బ్యాక్టీరియా ఉందని, దీనిని తాగడం మనుషులకు చాలా ప్రమాదమని చెప్పింది. అంతేకాదు ఆవు మూత్రాన్ని అసలు వాడకూడదని తేల్చి చెప్పింది. తాజా పరిశోధనలలో ఆవు మూత్రంలో 14 రకాల బ్యాక్టీరియాలు ఉంటాయని ఇవి ఆరోగ్యానికి అసలు మంచివి కాదని వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ