ఎన్నికలు వస్తున్నాయంటే.. గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఎన్నో హామీలు గుప్పిస్తుంటాయి. ఆ విషయంలో ఒక పార్టీకి మించి మరో పార్టీ పోటీ పడుతుంది. తెలంగాణ ఎన్నికల్లో ఇప్పుడు అదే జరుగుతోంది. అయితే.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన హామీల్లో ప్రధానంగా ఒకటి చర్చనీయాంశంగా మారింది. అదే గ్యాస్. పార్టీలు సాధారణంగా పేద ప్రజలు ఆశపడే వాటిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తుంటాయి. ఎందుకంటే దేశ వ్యాప్తంగా మొత్తం ఓటర్లలో పోలింగ్ కేంద్రాల దాకా వెళ్లి ఓట్లు వేసేది పేద ప్రజలే. సంపన్న వర్గాలు, వ్యాపార వాణిజ్యరంగాలకు చెందినవారు, మరీ ముఖ్యంగా ఐటీ రంగంలోని వారు ఓట్లేయడం తక్కువ.
అంత దూరం వెళ్లి క్యూలో నిల్చొని ఎవరికో ఓటేయాలా ? దాని వల్ల మనకు ఒరిగేదేమిటి ? టైమ్ వేస్ట్ వ్యవహారమంటూ వచ్చిన సెలవుతో ముసుగుతన్ని పడుకోవడమో, లేదంటే, ఇతరత్రా కార్యక్రమాలకు వినియోగించుకోవడమో పరిపాటి. ఆవిషయం తెలిసినందునే రాజకీయ పార్టీలు సైతం పేద, మధ్య తరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకునే మేనిఫెస్టోలు రూపొందిస్తుంటాయి. ఆ వర్గాలు ఆసక్తి చూపే టీవీలు, సెల్ఫోన్ల వంటివి కానుకలుగానూ పంపిణీ చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో నెలనెలా పైకెగబాగుతున్న గ్యాస్ ధరలపై అన్ని పార్టీలూ దృష్టి సారించాయి.
ఈ గ్యాస్ ధరలనుచూసే ప్రస్తుతం అధికారంలో ఉన్న నరేంద్రమోదీ సైతం తాను పవర్లోకి రాకమునుపు గ్యాస్బండకు మొక్కి పోలింగ్ కేంద్రానికి వెళ్లిన వార్తలు, ఫొటోలు బహుళ ప్రాచుర్యం పొందాయి. తాము అధికారంలోకి వచ్చాకైనా ఆయన వాటిని తగ్గించారా అంటే లేదు. ఎక్కడో రూ. 300– 400 లుగా ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధర్ వెయ్యిదాటి పైకెగబాకింది. ఇంటికి స్నేహితులొచ్చినా స్టవ్ వెలిగించాల్సిన మధ్య తరగతికి, ముఖ్యంగా మహిళలకు పెరిగిన గ్యాస్ధరలు కన్నీళ్లు తెప్పించాయి.కట్టెల పొయ్యిలతో పొగచూరిన బతుకుల నుంచి గ్యాస్తో విముక్తి లభిస్తుందనుకుంటే ఆకాశాన్నంటుతున్న గ్యాస్ ధరలతో సగటు మహిళలకు కన్నీళ్లే మిగిలాయి.
మిగతా అన్ని హామీల కంటే గ్యాస్కు అన్ని పార్టీలూ ప్రాధాన్యతనిచ్చేందుకు కారణం మహిళల కన్నీళ్లే. మహిళల నిర్ణయాలు మెజార్టీ సందర్భాల్లో విజయాలు సాధిస్తుంటాయి. మనితల నేడిపించి బాగుపడిన వాడెవ్వడూ లేడు. ఈ నేపథ్యంలో రాష్ట్రం విషయానికొస్తే కాంగ్రెస్ పార్టీ తొలుత వారిపై కరుణ చూపింది. తాము అధికారంలోకి వస్తే గ్యాస్ ధరను రూ. 500కు దించుతామని ఆరు గ్యారంటీల్లో పేర్కొంది. సహజంగానే దాని ప్రభావం తెలిసిన మిగతా పార్టీలు ఆవైపు దృష్టి సారించాయి. అధికార బీఆర్ఎస్ మరింత కరుణ చూపుతూ తాము రూ.400లకు గ్యాస్ పంపిణీ చేస్తామని ప్రకటించింది. కేంద్రం విధించే ధర ఎంతైనా మిగతా మొత్తాన్ని తామే భరించి రూ. 400కే పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఇంకా తన మేనిఫెస్టో వెల్లడించలేదు. బీఆర్ఎస్ కంటే అది మరింత ధర తగ్గిస్తామని ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఎందుకంటే ఏ పార్టీకైనా కావాల్సింది ఓట్ల పంట. దాన్ని పొందేందుకు, ఎదుటి పక్షంలో మంట పెట్టేందుకే ప్రయత్నిస్తాయి. ఈ నేపథ్యంలో ఈ గ్యాస్ ధరల హామీలు ఏపార్టీకి లాభం చేస్తాయి.. ఏపార్టీకి మంటపెట్టి సాగనంపుతాయన్నది పోలింగ్ తర్వాత తేలనుంది. అయితే.. ఈ గ్యాస్ హామీపై సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. సెటైరికల్ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఎన్నికల ముందు గ్యాస్ ధర తగ్గంచండి అని ప్రజలు కోరుతుంటే.. అది కేంద్ర పరిధిలోని అంశం అనే పార్టీలు ఇప్పుడు తక్కువ ధరకే ఇస్తామని ఎలా ప్రకటిస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు కూడా పేదలపై పడే భారాన్ని ప్రభుత్వాలే భరించి తక్కువ ధరకు పంపిణీ చేస్తామని ఎందుకు చెప్పలేదో అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.