108 ఉద్యోగులు జీతం కోసం పనిచేసే వారు కాదని, మానవత్వంతో ప్రాణాలు నిలబెట్టే వారని, కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడారని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్ లో జరిగిన తెలంగాణ 108 ఉద్యోగుల సంఘం రెండవ మహాసభకు మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర్ రావు కృషితో ప్రస్తుతం తెలంగాణ పచ్చని చీర కట్టిందని, ఇక ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తున్నామని, ఎన్ని డబ్బులు అయినా ఖర్చు చేయాలని ఆదేశించారని మంత్రి అన్నారు.
108 ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖలో అత్యంత కీలకం:
108 ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖలో అత్యంత కీలకమైన వారు. ఎమర్జెన్సీలో పనిచేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని అన్నారు. వారు పైసల కోసం కాకుండా ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం పనిచేస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో అనేకమందిని బ్రతికించారని అన్నారు. మీ అందరూ సంతోషంగా ఉంటేనే తెలంగాణ సంతోషంగా ఉంటుందని అన్నారు. పన్నెండు గంటల పని విధానం, ఈఎస్ఐ, పీఎఫ్ లాంటి సమస్యలు అన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తరువాత కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లేకుండా అందరినీ పర్మినెంట్ చేయాలని ప్రయత్నం చేసాము. కానీ చాలామంది కేసులు వేసి అడ్డుకున్నారని అన్నారు. అయినా రెండున్నర లక్షల మందికి జీతాలు పెంచుకొని కనీస వేతనం అందేలా చూస్తున్నామని అన్నారు.108 ఉద్యోగులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఏ సమయంలో ఫోన్ వచ్చినా పరిగెత్తే జాబ్. మానవత్వం, ప్రజల ప్రాణాలు కాపాడాలి అనే భావన ఉన్నవారు మాత్రమే వైద్య ఆరోగ్య శాఖ లో పనిచేయాలి అని అన్నారు. గొప్ప అంకిత భావంతో ఉండాలని మంత్రి కోరారు.
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్నాం:
పేదవారికి మెరుగైనసేవలందించేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి అన్నారు. ఇక ముందు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే అవసరం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామని చెప్పారు. అందుకోసమే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమయ్యి పలు కీలక నిర్ణయాలు తీసుకుందని అన్నారు. సీఎం ఆమోదం తరువాత వాటన్నిటినీ అమలుచేస్తామని అన్నారు. అమ్మఒడి, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, కంటివెలుగు లాంటి పథకాలు ప్రభుత్వ వైద్యం మీద ప్రజలకు నమ్మకాన్ని కలిగించడమే కాకుండా దేశంలో తెలంగాణకు గుర్తిపు తెచ్చాయని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఫలితాలు సాదించిందని అన్నారు. ఆరోగ్య తెలంగాణ లేకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదని సీఎం చాలా సార్లు అన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణ పచ్చని చీర కట్టింది. ఇక ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ప్రతి సంఘం వారి హక్కుల కోసం ఏర్పడుతుంది. మీ బాధలను అర్థం చేసుకొనే ప్రభుత్వం ఉంది కాబట్టి ఎమర్జెన్సీసేవలో ఉన్న మీరు మెడమీద కత్తి పెట్టినట్టు వ్యవహరించవద్దని 108 ఉద్యోగులను మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu