అక్కడ ఇద్దరూ ఇద్దరే. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వారే. ఒకరు తన తండ్రి మరణానంతరం అనూహ్యంగా వచ్చిన చాన్స్ తో ఎమ్మెల్యే అయి.. రెండో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటే.. ఇంకొకరు తన తండ్రి సహకారంతో తొలిసారి ఎన్నికల బరిలో నిలబడి ప్రత్యర్థులు ఢీ అంటే ఢీ అంటూ తనదైన శైలిలో ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఇద్దరూ నాగార్జున సాగర్ బరిలో తలపడుతున్నారు. దీంతో ఆ నియోజకవర్గం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఒకరు బీఆర్ఎస్ అభ్యర్థి, నోముల నర్సింహయ్య కుమారుడు ఎమ్మెల్యే నోముల భగత్ అయితే.. మరొకరు సీనియర్ కాంగ్రెస్ నేత, సీఎం స్థాయి వ్యక్తిగా చెప్పుకొంటున్న జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి. సీఎం కేసీఆర్ కే సవాల్ విసురుతూ జైవీర్ రాజకీయాల్లో ఆకట్టుకుంటున్నారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. నువ్వా – నేనా రీతిలో బీఆర్ ఎస్ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి కుందూరు జైవీర్ రెడ్డి తలపడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, సీఎల్పీ మాజీ నాయకుడు కుందూరు జానారెడ్డి ఈ సారి ఎన్నికల బరిలోకి దిగకుండా తన రాజకీయ వారసునిగా ఆయన తన చిన్న కొడుకు జైవీర్ రెడ్డిని పోటీకి దింపడం నుంచీ అక్కడ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. బీజేపీ నుంచి నివేదితా రెడ్డి ఇక్కడ పోటీలో ఉన్నా.. ఆమె పోటీ నామమాత్రమే కానుంది. ఇక, నాగార్జున సాగర్ లో ఇద్దరు యువకుల మధ్య ముఖాముఖి పోటీ కొనసాగుతోంది. ఈ ఇద్దరూ ఒక విధంగా వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన వారే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో నాగార్జున సాగర్ కు జరిగిన ఉపఎన్నికల్లో నర్సింహయ్య తనయుడు భగత్ అకస్మాత్తుగా తెరపైకి వచ్చి ఆ ఎన్నికల్లో గెలిచారు. నాడు తండ్రి పై సానుభూతితో భగత్ను ఎమ్మెల్యే పదవి వరించింది. అయితే.. భగత్ గెలుపు అంత ఈజీగా కనిపించడం లేదు.
తాను పోటీలో నిలవకుండా తన కొడుకును పోటీకి పెట్టి జానారెడ్డి రాజకీయ చతురతను చాటుకోవడమే కాదు.. ఇప్పుడు వెనకుండి చక్రం తిప్పుతున్నారు. కుమారుడి గెలుపునకు విశేషంగా కృషి చేస్తున్నారు. మరోవైపు జైవీర్ రెడ్డి సైతం ప్రచారంలో వినూత్న పంథాలో ఆకట్టుకుంటున్నారు. ఆయనకు ఇప్పటికే నాగార్జునసాగర్ యువత జై కొడుతోంది. మహిళలు హారతి పడుతున్నారు. ఎమ్మెల్యే కావాలని పెద్దలు ఆశీర్వదిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థికి గట్టి పోటీ ఎదురవుతోంది. అంతేకాకుండా.. జైవీర్ రెడ్డి సీఎం కేసీఆర్కు సైతం సవాల్ విసిరి ఆకట్టుకుంటున్నారు. ఓ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. 24 గంటలూ కరెంట్ ఇస్తే.. కాంగ్రెస్ కండువా తీసేసి పార్టీ మారతానని జానారెడ్డి చెప్పారని పేర్కొన్నారు. దీనికి బదులుగా జైవీర్ రెడ్డి మాట్లాడుతూ.. జానారెడ్డి గారు ఎప్పుడైనా అలా అని ఉంటే నేను పోటీ నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదంటూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెడతానంటూ జైవీర్ రెడ్డి ప్రచారంలో ఆకట్టుకుంటున్నారు.
దీనికితోడు నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోట. 1962 ఎన్నికల్లో పెదవూర నియోజకవర్గంగా ఉంది. ఆ ఎన్నికల్లో ఇక్కడ సీపీఐ గెలిచింది. 1967 నుంచి 2004 ఎన్నికల వరకు తొమ్మిది ఎన్నికలు చలకుర్తి నియోజకవర్గం పేరున జరిగాయి. 2007లో నియోజకవర్గాల పునర్విభజనలో చలకుర్తి 2009లో రద్దై ఆ స్థానంలో నాగార్జున సాగర్ గా పేరు మారింది. మొత్తంగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఏడు పర్యాయాలు, టీడీపీ మూడు సార్లు, ఉపఎన్నిక సహా బీఆర్ఎస్ రెండు సార్లు విజయం సాధించాయి. కుందూరు జానారెడ్డి టీడీపీ నుంచి రెండు సార్లు, కాంగ్రెస్ నుంచి అయిదు సార్లు మొత్తంగా ఏడు సార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నియోజకవర్గ ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే.. నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి పట్టుగొమ్మగా ఉంది. ఇప్పుడు మళ్లీ జైవీర్ రెడ్డి ఆ కోటలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ గెలిచింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, బీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహయ్య పోటీ పడగా, ఈ రెండు పార్టీల మధ్య కేవలం 2శాతం మాత్రమే ఓట్ల వ్యత్యాసం ఉంది. అదే 2018 ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్, 4 శాతం వ్యత్యాసంతో బీఆర్ఎస్ గెలిచింది. ఇక, 2021 ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ 10శాతం ఓట్ల తేడాతో గెలచింది. ఈ రెండు ఎన్నికలను మినహాయిస్తే.. ఏ రకంగా చూసినా.. నాగార్జున సాగర్ మొదటి నుంచి కాంగ్రెస్ అండదండగా ఉంటూ వస్తోంది. ఈ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థి జైవీర్ రెడ్డి కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తన సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ పోరాడాల్సి వస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE