తెలంగాణలో వర్షకాలం పంట దిగుబడి గణనీయంగా వచ్చిందని, దిగుబడికి అనుగుణంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు సహకరించాలని ఆహార, పౌరసరపరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం నాడు హైదరాబాద్ లోని తన కార్యాలయంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పౌరసరఫరాల కమీషనర్ అనిల్ కుమార్, ఎఫ్.సి.ఐ జి.యం అశ్విన్ కుమార్ గుప్తా, రాష్ట్ర రైసుమిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి మరియు జిల్లా స్థాయి రైసు మిల్లర్ల అసోసియేషన్ నిర్వహకులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, వానకాలం 2020-21 వరి ధాన్యం కొనుగోలు సజావుగా సాగేవిధంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.
రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం:
రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సన్న రకాలు పండించారని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా 6491 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 3074 కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, అలాగే ఇప్పటివరకు రూ.798.25 కోట్ల విలువగల ధాన్యాన్ని 73,982 మంది రైతులనుండి 93 వేల మెట్రిక్ టన్నుల సన్నరకాలను మరియు 3.30 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకాలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు.
రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం:
అకాల వర్షాల వలన సన్న రకాలకు దోమపోటుతో ధాన్యంరంగు మారిందని, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. రైసు మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు సజావుగా సాగేందుకు మిల్లర్లు సహకరించాలని మంత్రి సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైసు మిల్లర్లు, బారత ఆహార సంస్థ (ఎఫ్సిఐ) అధికారుల వైఖరి కారణంగా గత యాసంగి కి సంబందించిన ధ్యాన్యమును మర పట్టడాన్ని నిలిపివేస్తునట్లు ఇచ్చిన బందు నోటీసుపై ఈ రోజు ఎఫ్సిఐ జనరల్ మేనేజర్, ఇతర అధికారులు మరియు రైసు మిల్లర్లతో సమావేశము ఏర్పాటు చేసి అన్ని సమస్యలపై కులంకశంగా చర్చించి సమస్యను పరిష్కరించడంతో మిల్లర్లు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారని తెలిపారు. ఈ రోజు నుండి ధాన్యమును మరపట్టి సిఎంఆర్ బియ్యమును ఎఫ్సిఐకి సరఫరా చేయుటకు రైసు మిల్లర్లు అంగీకరించారని అన్నారు. రైసు మిల్లర్ల సమస్యలపై ఎఫ్సిఐ జనరల్ మేనేజర్ తో మాటాడి రవాణ సమస్య పరిష్కరిస్తామని అన్నారు. రైతులు సన్న రకాలను తక్కువ ధరలకు అమ్ముకోవద్దని మంత్రి కోరారు. అలాగే రైతులు తాలు, టప్పా లేకుండా కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ