తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికలపైన ప్రధాన పార్టీలన్నీ కసరత్తు షురూ చేశాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల పరాజయాన్ని అంతా మరిచిపోయేలా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి కేసీఆర్ లోక్ సభ ఎన్నికల కోసం సిద్దమవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అటు లోక్ సభ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోండగా…బీజేపీ అప్పుడే అభ్యర్దుల కసరత్తును కూడా ప్రారంభించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల కోసం సిద్దం అవుతోంది. దీని పైన ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షలు స్టార్ట్ చేశారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ నేతలతో తాజాగా సమావేశమైన కేటీఆర్ జనవరి 26 లోగా సమావేశాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు అంతా సమాయత్తం కావాలని, అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించిన కేటీఆర్..చేవెళ్ల ఎంపీగా రంజిత్ రెడ్డి పేరు ఖరారు చేసారు.
మరోవైపు ఓటమితో డీలా పడిన కేడర్ను పార్లమెంట్ ఎన్నికలకు సిద్దం చేయడానికి మాజీ సీఎం కేసీఆర్ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. స్వయంగా కేసీఆర్ లోక్ సభ బరిలో దిగుతారని.. అలాగే తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ అభ్యర్దులను బరిలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది . కేసీఆర్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటు కాంగ్రెస్ శ్రేణులు సోనియా గాంధీని మెదక్ నుంచి పోటీ చేయాలని కోరినా.. తర్వాత మల్కాజ్ గిరి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఐదేళ్ల పాటు పార్టీని మసకబారకుండా ఉంచడానికి..తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా బీఆర్ఎస్ నిలబడటానికి వచ్చే లోక్సభ ఎన్నికలే కీలకం. దీంతోనే కేసీఆర్ స్వయంగా బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో కేసీఆర్ మెదక్ నుంచి ఎంపీగానూ..గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగానూ గెలుపొందారు. ఆ తరువాత ఎంపీగా కేసీఆర్ రాజీనామా చేయటంతో కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు.
కేసీఆర్కు పోటీగా మెదక్ నుంచి ఈ సారి కాంగ్రెస్ అభ్యర్దిగా విజయశాంతిని బరిలో దింపడానికి కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోంది. బీజేపీ నుంచి రాములమ్మ కాంగ్రెస్లో చేరిన సమయంలోనే మెదక్ సీటుపై ఆమెకు హామీ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో విజయశాంతి అప్పటి టీఆర్ఎస్ ఎంపీగా గెలుపొందారు. ఆ సమయంలో టీఆర్ఎస్ నుంచి కేసీఆర్, విజయశాంతి ఇద్దరే ఎంపీలుగా ఉన్నారు. తరువాత జరిగిన పరిణామాలతో టీఆర్ఎస్ను వీడి బీజేపీలోకి ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్లోకి విజయశాంతి మారారు.
మరోవైపు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చిన తరువాత ఈ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనిని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న కేసీఆర్..ఢిల్లీలో బీఆర్ఎస్ పేరు గట్టిగా వినిపించాలని ..ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పైన దూకుడుగా వ్యవహరించాలని పార్టీ నేతలకు సూచిస్తున్నారు. దీంతో..తెలంగాణలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో కూడా గట్టిపోటీ తప్పేలా లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE