వరద తీవ్రతతో నష్టపోయిన పంటలను, ఇళ్ళను పరిశీలించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “ఈ సంవత్సరం మంచి వర్షాలు పడి చెరువులు కుంటలు నిండి, తవ్వుకున్న బావులో, వేసుకున్నా బోర్లలో నిండుగా నీళ్లు నిండి ప్రతి వాగు వంక పారి పచ్చటి పొలాల్లో మంచి దిగుబడి వస్తుందనుకున్న సమయంలో అకాల వర్షాల వల్ల అంతా అతలాకుతలం అయ్యింది. నోటి కాడికి వచ్చిన వరి నీళ్లలో మొలకెత్తింది. పత్తి పొలాలు కళ్ళముందే నేలను తాకి కుళ్ళి పోయి, కాయలు నల్లగా అయిపోయాయి. కొన్ని గ్రామాల్లో తిరిగి చూశాను. రైతులు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ కరెంట్ ఇచ్చి, రైతుబందు ఇచ్చి ప్రతి గింజని కొని రైతును ఆదుకున్న ప్రభుత్వం ఇది. కాబట్టి ఇప్పుడున్న అసాధారణమైన పరిస్థితుల్లో ఏం చేయాలి, రైతాంగాన్ని ఎలా ఆదుకోవాలో తప్పకుండా సీఎం కేసీఆర్ తో కలిసి మేము అందరం ఆలోచన చేస్తాం” అని అన్నారు.
“కమలపూర్ మండలం శ్రీరాములపల్లి గ్రామంలో గాలి సునామి వచ్చింది. నీళ్ల సునామి విన్నాం కానీ గాలి సునామి వినలేదు. ఆ గ్రామంలో 500మీ వెడ్త్ తో కిలోమీటర్ పొడవుతో ఉన్న అన్ని ఇండ్లను కూల్చి వేసింది. ఊహించని రీతిలో నష్టం జరిగింది. అదృష్టం కొద్దీ ప్రాణాపాయం జరగలేదు. మనుషులు బయట ఉంటే పదుల సంఖ్య లో మరణాలు జరిగేవి. చాలా భయాంకరంగా గాలి సునామి వచ్చింది. నిన్న అధికారులు సర్వే చేశారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ కు నివేదించి గాలి సునామిలో నష్టపోయిన వాళ్ళని ఆదుకొనేలా చేస్తాం” అని మంత్రి ఈటల పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ రైతు పండించిన ప్రతి గింజని కొంటాం అని చెప్పారు:
నీళ్ల సమస్య ఉండొద్దని ఎస్సారెస్పీ కాలువను బాగుచేసుకున్నాం. వాగుల మీద చెక్ డ్యామ్ లు కట్టుకున్నాం. చెరువులన్నీ మిషన్ కాకతీయ ద్వారా బాగుచేసుకున్నాం. కానీ ఈ జల దాటికి ఎన్నడూ లేనట్టుగా ఫస్ట్ టైం లోయర్ మానేరు డ్యామ్ మొత్తం గేట్ లు ఓపెన్ చేసాం. ఈ జల దాటికి కొన్ని గండ్లు పడ్డాయి. కొన్ని కొట్టుకుపోయాయి. ఇవన్నీ సకాలంలోనే మరమ్మతులు చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్ రైతు పండించిన ప్రతి గింజని కొంటాం అని చెప్పారు. వర్షంతో ధాన్యం తడిసింది కాబట్టి నల్లబడ్డ ధాన్యం కొనే ప్రయత్నం చేస్తాం. రైతు కూడా ఉన్నంతలో పండిన పంటను మొలకెత్తకుండా నల్లబడకుండా కాపాడుకోవాలని మంత్రి రైతులను కోరారు. దొడ్డు వడ్లు ఐనా సన్న వడ్లు ఐనా ప్రతి గింజని కొంటామని మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu